ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్‌ ….

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు.
 
పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్‌) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …? తెలుసుకునేందుకు ‘పీపుల్స్‌పల్స్‌’ ఒక క్విక్‌/ ఇన్‌స్టాంట్‌ సర్వే జరిపింది.
 
ఇంకా 72 శాతం మంది టిఆర్ఎస్ అని మాత్రమే పిలుస్తున్నట్లు వెల్లడైంది. కేవలం 21 శాతం మంది తడబడి మళ్ళి `బిఆర్ఎస్’ అని సవరించుకున్నారు. నేరుగా `బిఆర్ఎస్’ అని మాట్లాడిన వారు కేవలం 4 శాతం మంది మాత్రమే ఉన్నారు. 3 శాతం మంది అయితే పార్టీ పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు.
 
 తెలంగాణలోని ఎంచుకున్న 17 జిల్లాల్లో, ఎంచుకున్న 51 మండలాల్లో 1625 మంది సాంపిల్స్‌తో జనవరి 5 నుంచి 9 వ తేదీ వరకు నిర్వహించింది. వివిధ జిల్లాల్లోని పార్టీ యంత్రాంగంతో నేరుగాను, ఫోన్‌ద్వారా సంప్రదించినప్పుడు, ముచ్చటించినప్పుడు, వారి ముచ్చట్లను బయటినుంచి గమనించినప్పుడు, వారి నోటిలోంచి ‘‘బిఆర్‌ఎస్‌’’ అనే మాట వస్తోందా? ఇంకా ‘టిఆర్‌ఎస్‌’ అంటున్నారా? అని చేసిన చిన్నపాటి సర్వే ఇది.