మాస్కో – గోవా విమానంకు బాంబు బెదిరింపు!

బాంబ్ బెదిరింపుతో మాస్కో–గోవా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ ఛార్టడ్ ఫ్లైట్ ను  గుజరాత్ లోని జామ్ నగర్ కు మళ్లించారు. విమానంలో బాంబ్ ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈ మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు జామ్ నగర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని చెప్పారు.  మొత్తం 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో  ఫ్లైట్  సోమవారం రాత్రి 9.49 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.
పోలీసులు, బాంబ్ డిటెక్షన్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కు చెందిన రెండు బృందాలు కలసి తనిఖీ చేయగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదని స్పష్టం చేశారు.  ప్రయాణీకుల అన్ని బ్యాగ్ లను తెరిచి చూసారు. తిరిగి మంగళవారం ఉదయం ఈ విమానం గోవాకు బయలుదేరింది.
మరోవైపు దీనిపై స్పందించిన రష్యా ఎంబసీ కార్యాలయం.. బాంబ్ బెదిరింపు గురించి భారత్ నుంచి తమకు సమాచారం వచ్చిందని తెలిపింది.  జామ్ నగర్ లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ య్యిందని..అందరూ సేఫ్ గా ఉన్నారని వెల్లడించింది.
 
మరోవంక, ఢిల్లీ నుంచి భువ‌నేశ్వర్ బ‌య‌లుదేరిన విస్తారా  విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.  ఢిల్లీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కావ‌డ‌వంతో తిరిగి ఢిల్లీలో సుర‌క్షితంగా ల్యాండ్  చేశారు.   ఈ సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారని..వారంతా సురక్షితమని  డీజీసీఏ ప్రకటించింది. ఈ ఘటనపై ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.