75 నగరాల్లో అందుబాటులోకి జియో 5జీ సేవలు

దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాజస్థాన్‌లోని మూడు నగరాల్లో  -జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్‌లలో జియో 5జి ని శనివారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  ప్రారంభించనున్నారు.  తాజాగా శుక్రవారం మరో నాలుగు నగరాల్లో-  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, జబల్‌పూర్‌, పంజాబ్లోని లూథియానా, పశ్చిమబెంగాల్లోని సిలిగురి నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దాంతో ఇప్పటివరకు దేశంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల సంఖ్య 75కు చేరినట్లు రిలయన్స్‌ జియో సంస్థ ప్రకటించింది. జియో 5జీ సేవలను దేశంలో వేగంగా విస్తరింపజేస్తున్నామని తన ప్రకటనలో జియో పేర్కొన్నది.  మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి, ఏకైక ఆపరేటర్‌ రిలయన్స్‌ జియోనేనని తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్‌ మొదలు అన్ని ప్రధాన నగరాల్లో జియో సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది. రిలయన్స్ జియో గత అక్టోబర్‌ 4న తొలిసారి ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతా నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. అక్టోబర్‌ 22న నట్వారా, చెన్నై నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేసింది. ఆ తర్వాత నవంబర్‌ 10న హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలు మొదలయ్యాయి.
ఆ తర్వాత రోజే గురుగ్రామ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌ నగరాల్లో జియో 5జీ సేవలు షురూ అయ్యాయి. అదేవిధంగా పుణెలో నవంబర్‌ 25న, గుజరాత్లోని 33 జిల్లాల్లో నవంబర్‌ 25న జియో 5జీ సేవలను లాంచ్‌ చేసింది. ఉజ్జయినిలో గత డిసెంబర్ 14న, కొచ్చి, గురువాయుర్‌లో డిసెంబర్‌ 20న 5జీ సేవలు మొదలయ్యాయి.
ఇక ఏపీలోని తిరుమల, విజయవాడ, విశాకపట్నం, గుంటూరులో డిసెంబర్‌ 26న 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్‌, ఔరంగాబాద్‌, చండీగఢ్‌, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్‌, ఖరార్‌, దేరబస్సీ నగరాల్లో గత డిసెంబర్‌ 28న 5జీ సేవలు మొదలయ్యాయి.
డిసెంబర్‌ 29న భోపాల్‌, ఇండోర్‌లో 5జీ సేవలను ప్రారంభించారు. ఇక ఈ ఏడాదిలో తొలిసారి జనవరి 5న ఒడిశాలోని భువనేశ్వర్‌, కటక్‌ నగరాల్లో రిలయన్స్‌ జియో 5జీ సేవలను షురూ చేశారు.