8 లక్షల కుటుంబాలకు ఉచితంగా డిష్ టీవీ!

క్యాబినెట్ కమిట్ ఆన్ ఎకనమిక్స్ ఎఫైర్స్ (సీసీఈఏ) తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం ప్రసార భారతీ అప్‌గ్రేడ్‌కు కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చాహరు. దీని కింద ప్రభుత్వం 2025- 26 వరకు ఏకంగా రూ. 2,539.61 కోట్లు వెచ్చించనున్నారు. దీంతో సామాన్యులకు ఉచితంగానే డిష్ టీవీ సెట్ టాప్ బాక్స్‌లు పొందే వెసులుబాటు లభించనుంది.
 
కొత్త స్కీమ్‌లో భాగంగా కేటాయించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఆకాశవాణి, దూరదర్శన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించుకోనుంది. ఈ మేరకు ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.
 
ప్రసార భారతీకి ఆర్థిక చేయూత అందించాలని ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ బ్రాడ్ కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బిండ్) అనే స్కీమ్‌ను రూపొందించింది.దీని కింద బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కంటెంట్ డెవలప్‌మెంట్, ఆర్గనైజేషన్‌కు సంబంధించిన సివిల్ వర్క్ వంటి వాటిని అభివృద్ధి చేయనున్నారు.
 
ప్రస్తుతం దూరదర్శన్ 36 టీవీ ఛానళ్లను అందిస్తోంది. ఇందులో 28 రీజినల్ చానళ్ళు ఉన్నాయి. అలాగే ఆకాశవాణి అనేది 500కు పైగా బ్రాడ్‌కాస్టింగ్ సెంటర్లను కలిగి ఉంది. కొత్త స్కీమ్ వల్ల ఆకాశవాణి ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్స్ కవరేజ్‌ను పెరగనుంది. భూభాగంలో చూస్తే 66 శాతం కవరేజ్ (ప్రస్తుతం ఇది 59 శాతంగా ఉంది), జనాభా పరంగా చూస్తే 80 శాతం (ప్రస్తుతం 68 శాతంగా ఉంది) మందికి కవరేజ్ లభిస్తుంది
 
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ కింద 8 లక్షలకు పైగా డీడీ ఫ్రీ డిష్ సెట్‌ టాప్ బాక్స్‌లను పంపిణీ చేయనుంది. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, బార్డర్ ఏరియాలు, ఎల్‌డబ్ల్యూఈ ప్రాంతాల్లో వీటికి ఉచితంగా అందించనున్నారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పరోక్షంగా చాలా మందికి ఉపాధి కూడా లభించనుంది. మ్యానుఫ్చాక్చరింగ్, సర్వీసెస్ విభాగాల్లో ఉద్యోగాలు లభించే ఛాన్స్ ఉంది. బ్రాడ్ కాస్ట్ ఎక్విప్‌మెంట్ సప్లై, ఇన్‌స్టాలేషన్ వంటి వాటి ద్వారా ఉపాధి లభించొచ్చు.
 
దేశీ, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం అధిక నాణ్యత కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, మరిన్ని ఛానెల్‌లకు అనుగుణంగా డీటీహెచ్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా యూజర్లకు విభిన్న కంటెంట్‌ను అందుబాటులో ఉంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో సర్వీసులు మరింత మెరుగుపడనున్నాయి.