ఫిబ్రవరిలో మరోసారి ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం

అంతరిక్ష పరిశోధన సంస్థ స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్ఎస్ఎల్ వి) రెండో ప్రయోగాన్ని ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 108వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితమైన తేదిని మాత్రం చెప్పలేనని, వచ్చే నెలలో టెస్ట్‌ ఫ్లైట్‌కు ప్లాన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.
 
ఎస్‌ఎస్‌ఎల్‌వీ 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. గతేడాది ఆగస్ట్‌ 7న తొలిసారిగా ఎస్‌ఎస్‌ఎల్‌వీని ప్రయోగించగా.. విఫలమైన విషయం తెలిసిందే. దాంతో పాటు ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్)-2, అజాదిశాట్‌ కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది.
 

అలాగే చంద్రుడిపైకి ల్యాండ్‌రోవర్‌ను పంపడంతో పాటు ఈ ఏడాది మార్స్‌, వీనస్‌లను సైంటిఫిక్‌ మిషన్లను పంపాలని యోచిస్తుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో చంద్రయాన్-3 అంతరిక్ష నౌక దాదాపు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. జూన్‌లో మిషన్‌ను ప్రారంభించేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.ఈ సారి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని తెలిపారు. వచ్చే నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ ఆధారిత ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైలెన్స్-బ్రాడ్‌కాస్ట్ (ఎడిఎస్-బి ) రిసీవర్ సిస్టమ్‌ను సైతం పరీక్షించనున్నట్లు ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఎస్‌ఎస్‌ఎల్‌వీ టెస్ట్ ఫ్లైట్‌లోనే ఏడీఎస్‌-బీ వ్యవస్థను పరీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.