గంగారామ్ హాస్పిట‌ల్‌లో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ గంగా రామ్ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. రొటీన్ చెక‌ప్ కోసం ఆమె హాస్పిట‌ల్ వెళ్లిన‌ట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా కరోనా బారిన పడిన తరువాత కొన్ని రోజులు సర్ గంగారామ్ ఆసుపత్రిలోనే ఉన్నారు.
 
అప్పటి నుంచి ఆమె రెగ్యూలర్ చెకప్ అక్కడే చేయించుకుంటున్నారు. సోనియా కూతురు ప్రియాంకా గాంధీ వ‌ద్రా కూడా ఆమెతో ఉన్నారు. శ్వాస‌కోస ఇన్‌ఫెక్ష‌న్‌తో సోనియా బాధ‌ప‌డుతున్న‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది. మంగ‌ళ‌వారం నుంచి సోనియా ఆరోగ్యం క్షీణించిన‌ట్లు స‌మాచారం ఉంది.
 
దాని వ‌ల్లే జోడో యాత్ర మ‌ధ్య‌లో నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాలు.. ఢిల్లీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ చేప‌డుతున్న భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం యూపీలోకి ప్రవేశించింది. . యూపీలో 7 కిలోమీటర్ల మేర యాత్ర సాగిన సమయంలో సోనియా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాహుల్, ప్రియాంక అక్కడితో విరామం పలికి ఢిల్లీకి తిరిగి వచ్చారు.