చైనా బౌద్ధ మతాన్ని నాశనం చేయలేదు

బౌద్ధ మతాన్ని నాశనం చేయాలని చైనా ప్రయత్నిస్తోందని, అయితే ఆ ప్రయత్నాల్లో ఆ దేశం విజయం సాధించబోదని టిబెటన్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్పష్టం చేశారు. ఆయన బిహార్‌లోని బుద్ధ గయ, కాలచక్ర మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బోధనల కార్యక్రమంలో మాట్లాడుతూ  బౌద్ధ మతం విషపూరితమైనదని చైనా భావిస్తోందని, ఆ మతాన్ని నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తోందని దలైలామా ఆరోపించారు.

చైనా నుంచి ఆ మతాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ప్రయత్నిస్తోందని పేర్కొంటూఆ మతానికి సంబంధించిన వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని తెలిపారు. అయితే ఆ మతాన్ని నాశనం చేయడంలో చైనా విఫలమైందని ఆయన తేల్చి చెప్పారు. బౌద్ధ ధర్మం పట్ల తమకు బలమైన నమ్మకం ఉన్నట్లు తెలుపుతూ  తాను హిమాలయ ప్రాంతాల్లో పర్యటించినపుడు స్థానికులు బౌద్ధ ధర్మాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించడాన్ని గమనించానని చెప్పారు.

చైనా, మంగోలియాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొంటూ బౌద్ధ ధర్మానికి చైనా ప్రభుత్వం హాని చేసిందని, కానీ నాశనం చేయలేకపోయిందని చెప్పారు. నేటికీ చైనాలో బౌద్ధ ధర్మాన్ని విశ్వసించేవారు అనేక మంది ఉన్నారని చెప్పారు. అనేక బౌద్ధ విహారాలను ధ్వంసం చేసిందని, అయినప్పటికీ చైనాలో బౌద్ధ మతాన్ని అవలంబించేవారి సంఖ్య తగ్గలేదని స్పష్టం చేశారు.

తన పట్ల, బౌద్ధ మతం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించేవారు తాను బోధిస్తున్న బోధిచిత్తను కూడా అంగీకరించాలని ఆయన తెలిపారు. అది టిబెటన్ అయినా, మంగోలియన్ అయినా, చైనా అయినా, చైనాలో అనేక బౌద్ధ ఆరామాలు ఉన్నాయని చెప్పారు. తాను చాలాసార్లు చైనాకు వెళ్లానని తెలిపారు. అక్కడ నేటికీ అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజలు బౌద్ధాన్ని విశ్వసిస్తున్నారని, వారి మనసుల్లో బౌద్ధం ఉందని చెప్పారు. బౌద్ధంతో వారికి గొప్ప అనుబంధం ఉందని చెబుతూ బౌద్ధంతో చైనీయులకు పురాతన సంబందాలు ఉన్నాయని దలైలామా స్పష్టం చేశారు. వ్యక్తులు తమ సొంతం కోసం, ఇతరుల కోసం బోధిచిత్తను ఆచరించాలని కోరారు. టిబెటన్ సంప్రదాయాన్ని పరిశీలించినపుడు, షాక్యాస్ కూడా బోధిచిత్తను నిగమంలో ఆచరిస్తారని తెలిపారు.

బోధిచిత్త మనసు, శరీరాలపై ప్రభావం చూపుతూ, జీవితకాలం ఎక్కువగా ఉండేలా చేస్తుందని చెప్పారు. దీనివల్ల నిద్ర బాగా పడుతుందని, అందరి సంక్షేమం విషయంలో కూడా దీనికన్నా ఉత్తమమైనదేదీ లేదని స్పష్టం చేశారు.

“మనకు బుద్ధ ధర్మంపై బలమైన విశ్వాసం ఉంది, నేను హిమాలయ ప్రాంతాలను సందర్శించినప్పుడు, స్థానిక ప్రజలు ధర్మానికి చాలా అంకితభావంతో ఉన్నారని నేను గుర్తించాను. ఇది మంగోలియా, చైనాలో కూడా ఉంది. అయినప్పటికీ వ్యవస్థ (చైనీస్ ప్రభుత్వం) ధర్మాన్ని విషంగా చూస్తుంది. దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారి ప్రయత్నాలువిజయవంతం కావు” అని దలైలామా భరోసా వ్యక్తం చేశారు.

బోధిచిత్తను ఆచరించడం ద్వారా మనలోని చెడు, విచారాలను తొలగించుకోవచ్చునని చెప్పారు. కాలచక్ర మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతున్న దలైలామా ప్రసంగాలు, బోధనలు ఆదివారం ముగిశాయి.