గుజరాత్ లో ప్రమాదకరమైన కరోనా ఎక్స్ బిబి.1.5 వేరియంట్‌

ప్రమాదకరమైన కరోనా ఎక్స్ బిబి.1.5 వేరియంట్‌ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్‌ తొలి కేసు గురజరాత్‌లో నమోదైంది. ఇది గత వేరియంట్‌ బిక్యూ1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‌ను ఇటీవలనే అమెరికాలో కనుగొన్నారు.
ఈ వేరియంట్‌ను సూపర్‌ వేరియంట్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగా దవాఖానల్లో చేరే వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉన్నదని చైనీస్‌ మూలాలున్న అమెరికన్‌ ఆరోగ్య నిపుణుడు ఎరిక్‌ ఫీగెల్‌ డింగ్‌ వెల్లడించారు.
ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల్లోనే ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. బిక్యూ.1 ఆర్‌ వ్యాల్యూ కంటే దీని ఆర్‌ వ్యాల్యూ ఎక్కువ. బిక్యూ.1 కంటే 108 శాతం వేగంగా విస్తరిస్తున్నది. దీని విస్తరణ క్రిస్మస్‌ కంటే ముందుగానే ప్రారంభమైంది. ఇప్పుడు దీని విస్తరణ వేగం 120 శాతంగా ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.

గత రెండు వారాల్లో ఈ కొత్త వేరియంట్‌ బారిన పడిన వారి సంఖ్యను అమెరికాకు చెందిన సీడీసీ వెల్లడించలేదని ఎరిక్‌ చెప్పారు. చైనా మాదిరిగానే అమెరికా కూడా ఈ కొత్త వేరియంట్‌ డాటాను దాచిపెడుతున్నదని ఆరోపించారు. కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్నట్లు చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టిపడేశారు. ఎక్స్ బిబి.1.5 వేరియంట్‌ అమెరికాలోని నగరాల్లో వేగంగా విస్తరిస్తున్నది.

ఈ ఎక్స్ బిబి.1.5 వేరియంట్‌ అమెరికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. సింగపూర్‌లో కనుగొన్న ఎక్స్ బిబి.1.5 వేరియంట్‌ కంటే 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్‌లో ఈ కొత్త వేరియంట్‌ అక్టోబర్‌ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్‌ స్పష్టం చేశారు.

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇది ఒమిక్రాన్‌ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్‌ అని, ఇది ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు గుర్తించారు.