ఏడాదిలో దాదాపు ఆరు రేట్లు పెరిగిన బిఆర్ఎస్ ఆదాయం 

గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా గత ఏడాది కాలంలో బిఆర్ఎస్ ఆదాయం పెరగడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తోంది.  పైగా, ఎన్నడూ లేనంతగా ఎలక్టోరల్ బాండ్లు, ట్రస్టుల ద్వారా విశేషంగా ఆదాయం సమకూర్చుకుంది. ఏడాది కాలంలో సుమారు ఆరు రేట్లు పార్టీ ఆదాయం పెరిగింది.
2022 ఆడిట్ రిపోర్టును బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఇందులో పొందుపర్చిన వివరాలను చూస్తే 31 మార్చి 2021 నాటికి బీఆర్ఎస్ ఆదాయం మొత్తం రూ.37.65 కోట్లుగా ఉండగా, మార్చి 2022 నాటికి ఏకంగా రూ.218.11 కోట్లకు చేరుకుంది. అంటే ఏడాది కాలంలో సుమారు ఆరు రేట్లు పెరిగింది.

మరోవంక, 2021లో ఎలక్టోరల్ బాండ్లు, ట్రస్టుల ద్వారా బీఆర్ఎస్‌కు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. కానీ ఈ ఏడాది మార్చి నాటికి ఎలక్టోరల్ బ్రాండ్ల ద్వారా రూ.153 కోట్లు. ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం, అంటే మొత్తం మీద రూ. 193 కోట్లు వచ్చినట్లు తన ఆడిట్‌ రిపోర్టులో పేర్కొంది. నేడు దేశంలోని సంపన్న రాజకీయ పార్టీలలో ఒకటిగా బిఆర్ఎస్ ఉంది.

ఇక నికర ఆదాయం, ఓపెనింగ్ బ్యాలెన్స్, జనరల్ ఫండ్‌ మొత్తం కలిపి బీఆర్ఎస్ పార్టీ తాజా ఆస్తుల విలువ రూ.480 కోట్లుగా ఉంది. అలాగే 2021 మార్చి 31 నాటికి పోస్టాఫీసుల్లో డిపాజిట్ల రూపంలో రూ.253 కోట్లు ఉండగా, 31 మార్చి 2022 నాటికి రూ.451 కోట్లకు పెరిగింది.

31 మార్చి 2021 నాటికి రుసుములు, చందాల ద్వారా రూ.17 కోట్లు రాగా,  31 మార్చి 2022 నాటికి వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.8,04,74,020గా ఉంది. వ్యక్తిగత చందాల ద్వారా వచ్చిన ఆదాయం మార్చి 2021 నాటికి రూ.1,00,02,379గా ఉండగా, గత ఏడాది మార్చి నాటికి రూ.90,00,000గా ఉంది.
సాధారణ చందాల ద్వారా 2021 మార్చి నాటికి రూ.3 కోట్లు రాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.75 కోట్లు వచ్చాయి. గత ఏడాది మార్చి నాటికి ఇతర ఆదాయం ద్వారా రూ.16.21 కోట్లు రాగా, ఈ ఏడాది మార్చి నాటికి రూ.16.12 కోట్లు వచ్చాయి. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపు ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో కొనసాగుతోండగా, గతంతో పొలిస్తే 2021-2022 మధ్య కాలంలో మాత్రమే బీఆర్ఎస్ ఆదాయం విపరీతంగా పెరిగింది.