సెంట్రల్ సిలబస్ లో పాఠ్యాంశంగా భగవద్గీత

దేశంలో ఇక నుంచి సెంట్రల్ సిలబస్‌లో 6, 7 తరగతుల్లో భగవద్గీతను పాఠ్యంశంగా చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుని వస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా ఇక నుంచి భగవద్గీతను బోధించనున్నారు. అంతేకాదు భగవద్గీతలోని శ్లోకాలను 11, 12 తరగతుల్లో సంస్కృత పుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చనున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో తెలిపారు.
ఇంటర్ డిసిప్లినరీ, ట్రాన్స్-డిసిప్లినరీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020లో ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ)లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్) విభాగాన్ని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) 2022 పేరా 4.27 భారతదేశం సాంప్రదాయ జ్ఞానాన్ని సూచిస్తుందని, ఇది సుస్థిరమైనదని మంత్రి అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. ఇది అందరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ శతాబ్దంలో మనదేశం జ్ఞాన శక్తిగా ఎదగాలంటే, మనం మన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలని, ప్రపంచానికి ‘భారతీయ మార్గాన్ని’ నేర్పించాలని తెలిపారు. భగవద్గీత.. మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధి అని, అయితే గీత ఒక ప్రత్యేక గ్రంథంగా విశిష్టతను సొంతం చేసుకుందని వివరించారు.