రుషికొండ నిర్మాణాలలో ఉల్లంఘనలపై కేంద్రం దర్యాప్తు

విశాఖపట్నంలోని రిషికొండపై నిర్మాణాల విషయంలో దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రుషికొండ ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై కేంద్ర మంత్రిత్వ శాఖకు తెలుసా అని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో ప్రశ్నించగా ఈ విషయంపై దర్యాప్తు చేస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే సమాధానం ఇచ్చారు. 
 
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు 9.88 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే 2021 మే 19 న రాసిన లేఖ ద్వారా పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి కోసం క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. 
ఈ ప్రాంతాన్ని సర్వే చేయడానికి ఒక బృందాన్ని నియమించాలని, నిర్మాణ కార్యకలాపాలు జరిగిన కచ్చితమైన ప్రాంతం, స్లాపింగ్ కోసం ఉపయోగించిన ప్రాంతం గురించి ఓ నివేదికను సమర్పించాలని ఏపీ హైకోర్టు కేంద్ర పర్యాటక శాఖను ఆదేశించిందని మంత్రి అశ్వినీ కుమార్ వివరించారు. దీంతో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
 
పర్యావరణ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి కేంద్ర చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి ఎంపీ జీవీఎల్ ప్రశ్నించగా పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 లోని సెక్షన్ 3 ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం, మెరుగుపరచడం, కాలుష్యాన్ని నియంత్రించడం, తగ్గించడం కోసం అవసరమైన లేదా ప్రయోజనకరమైన అన్ని చర్యలను తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వం కలిగి ఉందని స్పష్టం చేశారు.

పార్లమెంటు సమావేశాల అనంతరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూరుషికొండ ప్రాజెక్టులో సీఆర్‌జెడ్ ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ త్వరలోనే బహిర్గతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మంజూరైన సీఆర్‌జెడ్ అనుమతి అన్ని ఉల్లంఘనలకు పాల్పడినవారు చట్టప్రకారం కచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

 
హైకోర్టు కీలక ఆదేశాలు 
 
 రుషికొండ వద్ద టూరిజం ప్రాజెక్టు పేరుతో అనుమతి తీసుకున్న విస్తీర్ణం కంటే అధికంగా కొండను తవ్వేశారంటూ పిటిషన్ల దాఖలవడంతో ఎపి హై కోర్టు రుషికొండ తవ్వకాల పై కీలక ఆదేశాలు జారి చేసింది. జనవరి 31 లోగా కేంద్రం నివేదిక ఇవ్వాలని, సర్వే టీంలో ముగ్గురు ఎపి అధికారులను తొలగించాలని ఆదేశించింది.
ఇది వరకు తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారమే కమిటి ఏర్పాటు చేసినప్పటికి అందులో రాష్ట్ర అధికారులకు స్థానం కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే ఐదుగురు సభ్యులతో కమిటి నియమించాలని తెలిపారు. అదే విధంగా అధికారుల వివరాలు హైకోర్టుకు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, అటవిశాఖకు ఎపి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.