ప్రయివేటు క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక సంక్షోభం

ప్రయివేటు క్రిప్టో కరెన్సీలతో తర్వాతి ఆర్థిక సంక్షోభం రానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు. ఇలాంటి కరెన్సీలపై నిషేధం విధించాలనే తన అభిప్రాయాన్ని ఆయన పునరుద్గాటించారు. ఓ పత్రిక సమ్మిట్‌లో శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ  క్రిప్టోలకు సరైన విలువ లేదని స్పష్టం చేశారు. 
 
పైగా, ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఒక వేళ భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం చోటు చేసుకుంటే అది క్రిప్టోలతోనే రానుందని తెలిపారు. 
 
”భారత్‌లో అంతర్గత ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా కొనసాగుతున్నాయి. అయితే.. బాహ్య కారకాలు ఆర్థిక వ్యవస్థకు కొంత నష్టం కలిగిస్తున్నాయి. ఈ ఏడాది క్రిప్టో కరెన్సీల విలువ 40 బిలియన్‌ డాలర్లు తగ్గింది. ప్రస్తుత ఈ కరెన్సీ విలువ ఇప్పుడు 140 బిలియన్‌ డాలర్లుగా ఉంది” అని ఆయన తెలిపారు. 
 
“ఇటీవలి క్రిప్టో ఎక్స్చేంజీ ఎఫ్‌టిఎక్స్‌ దివాలా తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని ఇంకా నమ్మదగిన వాదన ఏదీ లేదు. వీటికి ఎలాంటి అంతర్గత విలువ ఉండదు. నియంత్రణా వ్యవస్థలపై విశ్వాసం లేనివారే వీటిని సష్టించారు. ఇది ప్రజలకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చుతుందో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది.” అని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. 
 
డిజిటల్‌ ఇ- రూపాయిని భవిష్యత్‌ కరెన్సీగా ఆయన అభివర్ణించారు. ఇది ఈ శతాబ్దంలో డిజిటల్‌ కరెన్సీలో భారత్‌ను ముందంజలో ఉంచుతుందని దాస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది రుణాలు తీసుకోలేని చెప్పారు. ఆ సమయంలో డిపాజిట్లు భారీగా నమోదయ్యాయని తెలిపారు. 
 
క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డిసెంబరు వరకు రుణాల్లో భారీ వద్ధి చోటు చేసుకోగా.. డిపాజిట్లలో క్షీణత నమోదయ్యిందని చెప్పారు. దేశంలో ఈ ఏడాది తొలి నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరాల సంబంధ సమస్యలే ప్రధాన కారణమని ఆర్‌బిఐ విడుదల చేసిన ఓ బులిటెన్‌లో పేర్కొంది. ఇటీవల తగ్గిన ద్రవ్యోల్బణం తీవ్రతతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌, వ్యయాలు భారీగా పెరుగుతున్నాయని అంచనా వేసింది.