ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ అరెస్ట్

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌  అరెస్టయ్యారు. చందా కొచ్చర్‌ (59)తో పాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ‘వీడియోకాన్‌ కుంభకోణం’ కేసులో అవకతవకలకు పాల్పడినట్లు చందా కొచ్చర్ దంపతులు కొంత కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో వీరిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. తాజాగా వీరిద్దరినీ ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ కేసులో దీపక్ కొచ్చర్ 2020లోనే ఒకసారి అరెస్టయ్యారు. వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడారనే అభియోగాలపై ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందా కొచ్చర్‌ 2018లో వైదొలిగారు.
2012లో బ్యాంకు సీఈవో హోదాలో రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేశారని, అది ఎన్‌పీఏగా మారడంతో తద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని సీబీఐ అభియోగాల్లో పేర్కొన్నారు. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల కేటాయింపు అంశంలో చందా కొచ్చర్ ప్రతిష్ట మసకబారింది. ఈ కేసు కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో కీలక పదవులను కోల్పోవడమే కాకుండా, బ్యాంకింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగిన చందా కొచ్చర్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా చందా కొచ్చర్ ఇల్లు, ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ముంబైలోని చందా కొచ్చర్ ఫ్లాట్‌, ఆమె భర్త దీపక్‌ కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ 2020లోనే అటాచ్‌ చేసింది. వీటి విలువ రూ. 78 కోట్లని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పైనా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. 
 
2012లో వీడియోకాన్‌ గ్రూప్  బ్యాంక్‌ నుంచి రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్ కుటుంబం లాభపడిందనేది ప్రధాన అభియోగం. 2019 జనవరిలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌‌తో పాటు మరికొందరిపై మనీ లాండరింగ్‌ కింద క్రిమినల్‌ కేసు నమోదైంది.