కరోనా కేసుల విజృంభణపై ఆందోళన అవసరం లేదు 

చైనాలో కరోనా కేసులు విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తల పట్ల  భారతీయులు మరీ ఎక్కువగా ఆందోళనచెందవలసిన అవసరం లేదని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎఐఐఎంఎస్) మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా భరోసా ఇచ్చారు. ఇటీవలే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మేదాంత హాస్పిటల్ డైరెక్టర్ (వైద్య విద్య)గా కూడా వ్యవహరిస్తున్నారు.
చైనా, ఇటలీలలో పరిణామాలను గుర్తించి, తక్కువగా సిద్ధమవడం కన్నా మితిమీరిన సన్నద్ధత మంచిదని తాము గతంలో భావించామని, దానివల్ల మేలు జరిగిందని డాక్టర్ గులేరియా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శాస్త్రవేత్తలు, క్లినిషియన్స్, విధాన రూపకర్తల మధ్య సమన్వయం ఉండటం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు.
గతంలో చాలా ముందుగానే అష్ట లాక్ డౌన్ ను విధించడంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి, తాము సిద్ధమవడానికి వీలయిందని ఆయన  చెప్పారు. అయితే అప్పట్లో లాక్ డౌన్ లపై విమర్శలు వచ్చినప్పటికీ, వాటిని అమలు చేసినట్లు తెలిపారు. పైగా, కరోనా రోగులకు చికిత్స చేయడం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడానికి లాక్ డౌన్ లు విధించడం వల్ల అవకాశం కలిగిందని ఆయన చెప్పారు.
ఆ సమయంలో మౌలిక సదుపాయాలను తగిన విధంగా మార్చుకోవడానికి, పునర్నిర్మించడానికి, సిద్ధమవడానికి అవకాశం కలిగిందని అయన తెలిపారు. ఇది రోలర్ కోస్టర్ రైడ్ వంటిదని, అయినప్పటికీ, చాలా పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే, మనం చాలా గొప్ప పని చేయగలిగామని డా. గులేరియా స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి దాడి చేసినపుడు ఆ వైరస్‌ను నిరోధించగలిగే రోగ నిరోధక శక్తి మనకు ఉండేది కాదని పేర్కొన్నారు. ఫలితంగా కొంతమంది వ్యక్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారి తీసిందని, అయితే  ఇప్పుడు ఈ మహమ్మారి వచ్చి మూడేళ్ళు అవుతోందని, అత్యధిక స్థాయిలో సహజంగా ఇన్ఫెక్షన్‌కు గురైన పరిస్థితి నేడు ఉందని ఆయన తెలిపారు.
 చాలా మంది చాలాసార్లు ఈ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని, మరోవైపు టీకాకరణ కూడా విస్తృత స్థాయిలో జరిగిందని తెలిపారు. ఈ వైరస్‌ను దీటుగా నిభాయించగలిగే స్థాయిలో మన రోగ నిరోధక శక్తి ఉందని స్పష్టం చేశారు. ఈ వైరస్ మనపై తీవ్రంగా దాడి చేసే అవకాశాన్ని మన రోగ నిరోధక శక్తి ఇవ్వబోదని ఆయన చెప్పారు.
గతంలో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు వచ్చాయని, గత ఏడాదిలో కేవలం ఒమిక్రాన్ నుంచి వచ్చిన సబ్ లైనేజెస్ మాత్రమే వస్తున్నాయని గా. గులేరియా తెలిపారు. చాలా భయానకమైన ప్రత్యేకతగల కొత్త వేరియంట్ ఏదీ రాలేదని, అయినప్పటికీ మనం అప్రమత్తంగా ఉండటం అవసరమని ఆయన వివరించారు.
వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కాబట్టి గట్టి నిఘా పెట్టాలని ఆయన సూచించారు.  చైనాలో వైరస్ కాస్త ఎక్కువ నిలకడగా, మందగమనంతో ఉన్నట్లు కనిపిస్తోందని, అక్కడి మరణాల రేటు, ఆసుపత్రుల్లో రోగుల చేరిక పెరుగుదలను గమనిస్తూ ఉండాలని తెలిపారు.