మిసెస్‌ వరల్డ్‌-2022గా భారత్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌

భారత్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌ మిసెస్‌ వరల్డ్‌-2022 టైటిల్‌ను సొంతం చేసుకున్నది. వెస్ట్‌గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్‌ క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో 2021 విజేత అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్.. సర్గమ్‌ కౌశల్‌కు కిరీటాన్ని బహూకరించింది. 

63 దేశాలకు చెందిన మహిళలను ఓడించి కిరీటాన్ని సొంతం చేసుకున్నది. పోటీల్లో పాలినేషియా, కెనడాకు చెందిన వనితలు రన్నరప్స్‌గా నిలిచారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత  భారత్‌ నుంచి సర్గమ్‌ కౌశల్‌ మిసెస్‌ వరల్డ్‌గా ఎంపికైనట్లు మిసెస్‌ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది.

అయితే, టైటిల్‌ను సాధించడంపై సర్గమ్‌ కౌశల్‌ హర్షం వ్యక్తం చేసింది. 21 సంవత్సరాల తర్వాత భారత్‌ తరఫున మళ్లీ కిరీటాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. లవ్‌ యూ ఇండియా.. లవ్‌ యూ వరల్డ్‌ అంటూ సంతోషం వ్యక్తం చేసింది.  సర్గమ్‌ కౌశల్‌ ఇన్‌స్టా పోస్టు ప్రకారం.. ఆమె జమ్మూ కశ్మీర్‌కు చెందిన మహిళ కాగా.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు.  

క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఆమె గతంలో వైజాగ్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తన భర్త ఇండియన్ నేవీలో పని చేస్తున్నట్లు తెలిపింది. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌ల మాదిరిగానే వివాహిత మహిళల కోసం మిసెస్ వరల్డ్ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు.

2001లో తొలిసారి భారత్‌కు చెందిన డాక్టర్‌ అదితీ గోవిత్రికర్‌ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక మిసెస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్న భారత్ మహిళగా సర్గమ్‌ రికార్డు సృష్టించారు. గ్రాండ్ ఫినాలే కోసం ప్రముఖ డిజైనర్ భావనా రావు డిజైన్ చేసిన గులాబీ రంగు స్లీవ్‌లెస్ గౌనును ధరించారు.

మిసెస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన సర్గమ్‌ కౌశల్‌ను అదితీ గోవిత్రికర్‌ అభినందించారు. వాస్తవానికి 2022-23 మిసెస్ ఇండియా పోటీలకు అదితీ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కాగా, తెలుగులో పవన్ కళ్యాణ్‌తో కలిసి తమ్ముడి సినిమాలో అదితీ నటించారు.