బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో గెలిచి ఫైనల్ దిశలో భారత్

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 272/6తో చివరి రోజు, ఆదివారం ఛేదన కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. 

జాకిర్ హసన్ (100), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (84), నజ్ముల్ హొస్సేన్ శాంటో (67) సత్తా చాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4/77), కుల్దీప్ యాదవ్ (3/73) రాణించారు. చివరి రోజు ఆట మొదలైన వెంటనే మెహిదీ హసన్‌(13)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.

ఆ తర్వాత ధాటిగా పోరాడుతున్న కెప్టెన్ షకీబల్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. కాసేపటికే తైజుల్ ఇస్లాం (4) అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అవగా.. ఎబాదత్ అహ్మద్ (0)ను కుల్దీప్ యాదవ్ చివరి వికెట్ గా వెనక్కు పంపాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 404 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ను భారత్ 258/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 40 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఈనెల 22 నుంచి మీర్పూర్ లో జరగనుంది.

బంగ్లాపై విజయంతో డబ్ల్యూటీసీలో 55.77 పాయింట్స్ పర్సంటేజీ సాధించిన భారత్ శ్రీలంకను వెనక్కి నెట్టింది. తొలి టెస్టులో బంగ్లాపై గెలుపొందడంతో  ఫైనల్ చేరే అవకాశాలు మెరుగయ్యాయి.

తుది పోరు రేసులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్ ముందంజలో నిలిచాయి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్‌‌పై రెండో టెస్టులో విజయం సాధించడం, స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడు టెస్టుల్లో గెలుపొందడంతో పాటు మరో టెస్టును డ్రాగా ముగించాలి.

అప్పుడే 64.35 పీసీటీతో ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత్ ఫైనల్ చేరే అవకాశాలను ప్రస్తుతం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న మూడు టెస్టుల సిరీస్ ఫలితం కూడా ప్రభావితం చేయనుంది. ఇటీవలి వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్న ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో విజయం దిశగా సాగుతోంది.

ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటి వరకూ 13 టెస్టులు ఆడిన భారత్ 7 మ్యాచ్‌ల్లో గెలిచి నాలుగింట్లో ఓడింది, రెండు టెస్టులను డ్రాగా ముగించింది. మరోవైపు బంగ్లాదేశ్ 11 టెస్టుల్లో ఒక దాంట్లో గెలిచి 9వ స్థానంలో కొనసాగుతోంది.