సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్న సార్మడీలు, పటేల్లకు సత్కారం

సామాజిక సమరసత వేదిక  ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బేలా,ఉట్నూర్,ఇంద్రవెల్లి మండలాల లోని 200 గ్రామాలకు చెందిన సార్మడీలకు,పటేల్లను డిసెంబర్ 15,17 తేదీలలో ఉట్నూర్ లో మరియు చందుపల్లిలో ఘనంగా సత్కరించారు.

వనవాసీలలో గోండులు, పరధానులు, కొలాములు, నాయకపోడులు, ఆంధ్ లు,  తోటిలు.. మొదలైన తెగల పెద్దలు ఎటువంటి భేదభావాలు లేకుండా, కలిసి ఐక్యంగా పాల్గొనటం విశేషం. ఉట్నూర్ ఎంపిటెసి జైవంతరావు, బేలా సార్మడి సోన్ రావు ల ఆధ్వర్యంలో సుమారు 500 మంది వనవాసీలు తరలివచ్చారు. గోండులలో జన్మించిన మహనీయులైన కొమరంభీమ్, రాంజీగోండు, బిర్సా ముండా, తిలకామాంఝీ, రాణీగైడిన్లు, రాణి దుర్గావతి చిత్రాలు, వనవాసీలు జరుపుకునే పండుగల చిత్రాలతో కూడిన మెమెంటోలు,  చలి దుప్పట్లు, హనుమాన్ చాలీసా పుస్తకాలను వారికి పంపిణీ చేశారు.

వనవాసీలు హిందువులు కాదని, వారు ఆచరించేది హిందూ సంస్కృతి కాదని, వారిది ప్రత్యేక మతం అని చెప్తూ కొన్ని శక్తులు వారిలో వేర్పాటువాదాన్ని రెఛ్ఛగొడుతున్న నేపథ్యంలో సామాజిక సమరసత వేదిక ఆదివాసీ గూడెంలోని ప్రజలలో తమ సంప్రదాయాల పట్ల స్వాభిమానాన్ని గుర్తు చేస్తూనే, పురాణ కథలలో, చారిత్రక గాథలో, నెలవారీ పండుగలలో కనిపించే సామీప్యతను తెలిపి, మనందరిది ఒకే దేశం,ఒకే సంస్కృతని, మనం కలిసి మెలిసి జీవించాలని వక్తలు అభిప్రాయ పడ్డారు. అలాగే రానున్న తరానికి తమ పద్దతులను నేర్పాలని, రాముడు- శబరి,   భీముడు-హిడింబి,   అర్జునుడు-ఉలూపి, కృష్ణుడు-రుక్మిణి ల మధ్య సంబంధం మనందరం ఒకటేనని తెలియజేస్తుందని వక్తలు తెలిపారు.

ఆదిశేషువును వనవాసీలు ఇలవేలుపుగా కొలుస్తూ, నాగదేవత కృపా కటాక్షంతో అలాగే కురువంశంలోని కౌరవ పాండవుల వంశీకులై , నాలుగు యుగాల చరిత్ర ను  తమ కథలుగా చెప్పుకుంటూ, 12 నెలల లో వచ్చే ప్రతి పండుగను శ్రధ్ధా భక్తులతో జరుపుతున్న గిరిజనుల ప్రాచీన గోండి భాష , నాట్యం , సాహిత్యం, ఆచార సంప్రదాయ కళలను కాపాడాల్సిన బాధ్యతను వక్తలు గుర్తు చేశారు.