చైనా, పాక్ లాగా మాట్లాడుతున్న రాహుల్

అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సైనికులు భారత జవాన్లపై దాడి చేసి కొడుతున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాహుల్ గాంధీ చైనా, పాక్ లాగా మాట్లాడుతున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ దేశభక్తిపై అనుమానాలు లేవనెత్తుతున్నాయని చెప్పారు.

ఆయన గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌ను, బాలాకోట్ వైమానిక దాడులను కూడా ప్రశ్నించారని  ఇది ఆయన మానసిక దివాలాకోరుతనానికి అద్దం పడుతోందని నడ్డా పేర్కొన్నారు.

కాగా  భారత దేశ ప్రతిష్ఠను దిగజార్చి, సాయుధ బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీనుంచి బహిష్కరించాలని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని పృథ్వీరాజుకు వెన్నుపోటు పొడిచిన కనౌజ్ రాజు జయచంద్రతో పోల్చుతూ సాయుధ బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి రాహుల్ నిరంతరం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

గతంలో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన సర్జికల్ దాడులను, గల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణల సందర్భంగా కూడా రాహుల్ ఇలాగే మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి రాహుల్ ప్రయత్నించారని భాటియా తెలిపారు. దేశ ప్రజలకు రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా ఈ నెల 9న భారత, చైనా సైనికలు మధ్య ఘర్షణ చోటుచేసుకున్న తవాంగ్ ప్రాంతాన్ని కేంద్ర న్యాయాశాఖ మంత్రి శనివారం సందర్శించారు. తవాంగ్ భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అనంతరం ఆయన ప్రకటించారు. చైనా యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉంటే కేంద్రం మొద్దు నిద్ర పోతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రిజిజు ఓ ట్వీట్‌లో తిప్పికొట్టారు.

‘రాహుల్ గాంధీ కేవలం భారత ఆర్మీని అవమానించడమే కాదు, దేశ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తున్నారు.ఆయన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సమస్య కాదు, దేశాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తున్నారు. మన సాయుధ బలగాలను చూసి దేశం గర్విస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలను తప్పుబడుతూ స్థానికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఒక వీడియోను సైతం విడుదల చేశారు.

 కాగా,తవాంగ్ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని కేంద్ర మంత్రి ప్రకటించారు. భారత ఆర్మీకి చెందిన వీర జవాన్లు తగినంత మంది అక్కడ మోహరించినట్టు చెప్పారు.

కాగా, సైనికుల్లో గందరగోళానిు సృష్టించి వారి నైతిక స్ఠైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేత రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరించినట్లైతే, వారికి తగు రీతిలో సమాధానమిస్తారని ఆయన చెప్పారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తును రాహుల్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుండి బహిష్కరించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.