బిల్కిస్‌బానో పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం

బిల్కిస్‌బానో పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ బుధవారం అసహనం వ్యక్తం చేశారు. పిటిషన్‌ విచారణ కోసం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ పదే పదే ప్రస్తావించవద్దని.. చాలా చిరాకు తెప్పిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోషుల విడుదల పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టాల్సి వుంది. అయితే ఈ పిటిషన్‌ విచారణ బెంచ్‌లో భాగమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి బేలా ఎం. త్రివేది తప్పుకున్నారు. త్రివేది 2004-2006 మధ్య కాలంలో గుజరాత్‌ ప్రభుత్వం లా సెక్రటరీగా పనిచేయడంతో, ఆమె బెంచ్‌ నుండి వైదొలగడంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది. మరో కొత్త బెంచ్‌కు జాబితా చేయాల్సి వుంది.
గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ ఒకరోజు క్రితమే జాబితా చేయబడిందని, కానీ కోర్టు దానిని విచారణకు స్వీకరించలేదని బిల్కిస్‌ బానో తరపున హాజరైన న్యాయవాది శోభా గుప్తా సిజెఐ చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. రిట్‌ జాబితా చేయబడుతుందని, పదేపదే ప్రస్తావించవద్దంటూ సిజెఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్కిస్‌ బానో కుటుంబ సభ్యులను హత్య చేయడంతో పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన నేరం కింద ఈ 11 మందిని దోషులుగా గుర్తించి, వారికి జీవిత ఖైదు విధించింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ మార్గదర్శకాల కింది బిల్కిస్‌ బానో కేసులో శిక్ష పడిన 11 మందిని గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది. వారి విడుదలను సవాలు చేస్తూ బిల్కిస్‌ బానోతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రా, సిపిఎం నేత సుభాషిణీ అలీ, స్వతంత్ర జర్నలిస్ట్‌ రేవతి లాల్‌, కార్యకర్త రూప రేఖ వర్మ, మాజీ ఐపిఎస్‌ అధికారి మీరన్‌ చద్దా మరికొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.