టీటీడీ ఈఓ ధర్మారెడ్డి‎కి నెల రోజులు జైలు శిక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజులు జైలు శిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగులరైజ్ చేయాలని ధర్మారెడ్డిని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదు. 

అందుకే ధర్మారెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అయితే ఆ జరిమానా చెల్లించకుంటే మరో వారం జైలు శిక్ష పొడిగించాలని ధర్మాసనం ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని ధర్మాసనం ఘాటుగానే వ్యాఖ్యానించింది. అయితే డివిజన్ బెంచ్ ఈ తీర్పు అమలుపై స్టే ఇచ్చింది. 

మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టు తీర్పునిచ్చింది. ధార్మిక సంస్థలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున .. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తే అదే బాటలో వందలాదిమంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే విషయాన్ని డివిజన్‌ బెంచ్‌కు టిటిడి అప్పీలు చేసుకుంది. 

దీంతో హైకోర్టు మధ్నాహ్యం రెండు గంటలకు స్టే ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ధర్మారెడ్డి అప్పీలు పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు అధికారుల తీరును సైతం పలు సందర్భాల్లో ధర్మాసనం తప్పు పట్టింది.

గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం పోరాడారు. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయ పోరాటం అంటూ కోర్టును ఆశ్రయించారు. వారి తరపు అడ్వకేట్ల వాదనతో ఏకీభవించిన కోర్టు  ఆ ముగ్గురినీ క్రమబద్దీకరించాలని ఆదేశాలిచ్చింది. 

కోర్టు ఆదేశాలు ఇచ్చినా  వాటిని అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ ఈవో తీరును తప్పు పట్టింది. కోర్టు చెప్పినా మాట వినారా అంటూ గట్టిగానే ప్రశ్నించింది.  ఇలాంటింది మళ్లీ రిపీట్ కాకూడదని హెచ్చరిస్తూ టీటీడీ ఈవోకి నెల రోజుల శిక్ష విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్. దాంతో పాటే రూ.2వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు 27వ తేదీ లోపు అమలు చేయపోతే శిక్షా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.