వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆమె దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం షర్మిలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణించిందని, ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో షర్మిలను బలవంతంగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దీంతో అర్ధరాత్రి లోటస్‌పాండ్ వద్ద హైడ్రామా నెలకొంది. షర్మిలకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.
అపోలో ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స చేయించుకునేందుకు వైఎస్ షర్మిల నిరాకరించారు. వైఎస్ విజయమ్మ అపోలో ఆస్పత్రికి చేరుకుని షర్మిలను పరామర్శించారు. అనంతరం ఆమె తిరిగి లోటస్‌పాండ్‌కు వెళ్లారు. అపోలో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను పరిసర ప్రాంతాల్లోకి రానీయకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో షర్మిల ఆరోగ్యం క్షీణించినట్లు డాక్టర్లు చెబుతున్నారు.  యూరియా, బీపీ, గ్లూకోజ్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు అపోలో వైద్యులు స్పష్టం చేశారు. లాక్టేట్ లెవల్స్ బాగా పెరిగాయని, శరీరం డీహైడ్రేషన్ అయినట్లు తెలిపారు.
పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వాలని, అరెస్ట్ చేసిన వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి అక్కడే షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్‌కు తరలించారు. దీంతో లోటస్‌పాండ్‌లోనే షర్మిల ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. పాదయాత్రకు అనుమతి, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను విడుదల చేసేంతవరకు దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల తేల్చిచెప్పారు.
వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, నేతలు ఆకారణంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. లోటస్ పాండ్ చుట్టూ బారికేడ్లు పెట్టారని, సామాన్యులను కూడా రానివ్వడం లేదని అన్నారు. తనను కలవడానికి వస్తున్న వైఎస్సార్‌టీపీ శ్రేణులకు అదుపులోకి తీసుకుంటున్నారని, పోలీసుల తీరు సరిగ్గా లేదని విమర్శించారు.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలకు శనివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అపోలో డాక్టర్లు.. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇలాగే కొనసాగితే కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. బ్లడ్ టెస్టులు ఆమెకు నిర్వహించారు. వైద్యుల ప్రకటనతో చివరికి అర్ధరాత్రి షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు.