క్లిష్టమైన సవాళ్ల పరిష్కారం కోసమే బీజేపీ వైపు

దేశానికి క్లిష్టమైన సవాళ్లు ఎదురైతే పరిష్కారం కోసం దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.   బీజేపీ దేశం కోసం కఠినమైన, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. బంధుప్రీతి, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజల నుంచి బీజేపీ లభిస్తున్న మద్దతు సామాన్యమైనది కాదని.. ఇది నూతన భారత ఆకాంక్షలకు ప్రతిబింభమని తెలిపారు.
 
గుజరాత్‌ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి బీజేపీకి చారిత్రక విజయం అందించారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు గజమాల వేశారు. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వాన్ని మెచ్చుకున్నారు. బిజెపి ప్రజలు గతంలోని అన్ని రికార్డులను బద్దలు చేశారని కొనియాడారు. 
 
జాతి, కుల, మతాలకు అతీతంగా బీజేపీకి ఓట్లు వేశారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. భరోసా కలగడం వల్లే యువత బీజేపీకి ఓట్లేసిందని మోదీ చెప్పారు. విజన్‌తో పాటు, వికాసం కూడా సాధించగలిగే శక్తి సామర్థ్యాలుండటం వల్లే యువత బీజేపీకి ఓట్లేసిందని పేర్కొన్నారు.
 
దేశమే తొలి ప్రాధాన్యమనే సంకల్పంతో బీజేపీ పనిచేస్తుందని మోదీ చెప్పారు. మహిళలు, దళితులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేశారని పేర్కొన్నారు. భారత్ అమృత్‌కాలంలో ప్రవేశించిన తరుణంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు ద్వారా బీజేపీని ఆదరించారని మోదీ తెలిపారు. 
తాము కేవలం ఐదేళ్ల కోసం అభివృద్ధి ప్రణాళిక వేయడం లేదని చెబుతూ తాము దూరదృష్టితో పరిపాలన సాగిస్తున్నామని ప్రధాని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు పూర్తిగా అభివృద్ధికి సంబంధించినదని పేర్కొంటూ, దేశంలో సాగుతున్న పరిపాలన కారణంగా పేదల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. షార్ట్ కట్‌తో అధికారంలోకి వచ్చే వారి కారణంగా ఏ జరుగుతుందన్నది ప్రజలకు అర్థమైందని అంటూ అందుకే ప్రజలు వారికి అధికారం ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
 
 యూపీ రాంపూర్‌లో బీజేపీ అభ్యర్థి గెలిచారని చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని చెబుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారని మోదీ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపోటముల మధ్య ఒక్క శాతం మాత్రమే తేడా ఉందని పేర్కొంటూ ఒక్క శాతం తేడాతో ఓడిపోయినా హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి వంద శాతం సహకరిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.
 
అంతకు ముందు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన జేపీ నడ్డా గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చారిత్రక విజయాన్ని అందించారని ప్రశంసలు కురిపించారు. హిమాచల్ ప్రదేశ్, ఎంసీడీ ఓటర్లకు కూడా నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాము నిజాయితీపరులమని చెప్పుకుంటున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఆయన చురకలంటించారు. తప్పుదోవ పట్టించేందుకు ఆప్ నేతలు చేసిన యత్నాలను ప్రజలు తిప్పికొట్టారని నడ్డా చెప్పారు.