భారత ఐటి నిపుణులకు సులభంగా జర్మనీ వీసాలు!

ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ దేశాభివృద్ధికి దోహదపడే నైపుణ్యం కలిగిన నిపుణులకు తలుపులు తెరవడానికి సిద్ధమవుతున్నది. అమెరికాలో ఉద్యోగాల్లో కోతలు జర్మనీ ప్రభుత్వ నిర్ణయం ఆశలు రేపుతున్నది.
 ఈ నేపథ్యంలో భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి నైపుణ్యం కలిగిన కార్మికుల ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మెరుగుపరిచేందుకు ఒక ముసాయిదాను సిద్ధం చేశారు.  సోమవారం జరిగిన ఒక సమావేశంలో సమగ్ర భాగస్వామ్య ఒప్పందాలపై భారత-జర్మనీ విదేశాంగ మంత్రులు జైశంకర్‌, అన్నలెనా బేర్‌బాక్‌ సంతకాలు చేశారు.
జర్మన్ ప్రభుత్వం తన పౌరసత్వ చట్టాలను మార్చేందుకు సిద్ధమైంది.  విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించేందుకు పౌరసత్వ చట్టాల్లో భారీ మార్పులు చేస్తున్నది. వాస్తవానికి, జర్మనీకి డిజిటలైజేషన్ అవసరం. ఇది అక్కడ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు నమ్ముతున్నారు.
విదేశాల నుంచి ఐటీ నైపుణ్యం ఉన్న వారి కోసం జర్మనీ తీవ్రంగా వెతుకుతున్నది. ముసాయిదా చట్టం వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి జర్మనీలో కనీసం ఎనిమిదేండ్ల రెసిడెన్సీ అవసరాలను ఐదేండ్లకు తగ్గించే వీలున్నది.
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ రీసెర్చ్ ప్రకారం, జర్మనీకి ప్రతి సంవత్సరం కనీసం 4 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం. గతేడాది 2 లక్షల మంది ఇతర దేశాల నుంచి జర్మనీకి వచ్చారు. వీరిలో లక్షన్నర మంది యూరోపియన్‌ దేశాలకు చెందిన వారు. మిగతా వారు యూరప్ బయటి నుంచి వచ్చారు.
 వారిలో భారతదేశ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు. కొత్త చట్టం జర్మనీలో ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉండడాన్ని సులభతరం చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ నైపుణ్యం కలిగిన భారతీయులకు ఒక మంచి అవకాశం లభించనున్నది.