గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు రోజులపాటు జరిపిన సోదాలలో సుమారు రూ. 25 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్టు గుర్తించారు.
ఎంబీబీఎస్, పీజీ సీట్ల ఫీజుల నుంచి నిధులను కొందరు డైరెక్టర్లు దారి మళ్లించినట్లు ఈడీకి ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇక, భవన నిర్మాణాల పేరుతో రూ. 4 కోట్ల మేర నిధులు మళ్లించారని తేల్చారు. దాదాపు 27 గంటల పాటు జరిగిన సోదాలు, విచారణలలో ఎత్తున కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మూడు బ్యాగుల్లో ఈ పత్రాలను అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను పత్రాలతో సహా స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఎన్నారైలు పన్ను రాయితీల కోసం విదేశాల్లో ఇచ్చిన విరాళాలను ఇక్కడ కొందరు డైరెక్టర్లు డ్రా చేసుకున్నట్లు ఈడీ సోదాల్లో గుర్తించారు.
రికార్డుల్లోకి కరోనా రోగుల వివరాలు పోందుపర్చకుండా నిధులను మళ్లించారన్న అంశంపై ఈడీ పక్కా ఆధారాలు చిక్కాయి. 1500కు పైగా రోగుల నుంచి రూ. 30 కోట్లకు పైగా నగదు పక్కదారి పట్టినట్టు తేల్చారు. ఈడీ సోదాల్లో కొందరు డైరెక్టర్ల తెర వెనుక బినామీ బాగోతాలు కూడా వెలుగుచూశాయి.
ఓ డైరెక్టరుకు బినామిలుగా ఎస్సి, ఎస్టీలు ఉన్నారని భావిస్తున్నారు. ఆ డైరెక్టర్ దళితుల పేర్లతో అప్పులు తీసుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 40 కోట్ల మేర అప్పులు తిరిగి చెల్లించలేదని ఈడీ సోదాల్లో తేలినట్లు సమాచారం. ఎన్నారై నిధులతో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ వైద్య పరికరాలు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలను పరిశీలిస్తే.. మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ఈడీ అధికారులు చెబుతున్నారు.
More Stories
మూడు పార్టీల మేనిఫెస్టో విడుదల రేపే
ఇసుక అక్రమ తవ్వకాలపై జగన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ
నిప్పుల గండంగా మారిన తెలుగు రాష్ట్రాలు