ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దర్యాప్తును వేగవంతం చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఈ సందర్భంగా ధ్వంసం చేసిన్నట్లు గుర్తించిన మొబైల్ ఫోన్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది.. లిక్కర్ పాలసీ మార్పులో సౌత్ గ్రూప్(సౌత్ లిక్కర్లాబీ) నుంచి రూ.100 కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది.
దీనికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా 170 ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. ఇందులో 17 ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. మిగతా 153 ఫోన్లను ఏం చేశారనే వివరాలు రాబడతున్నది.
ఈ స్కామ్లో 36 మంది నేరపూరిత కుట్రకు పాల్పడ్డట్లు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడించింది. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఫోన్ నంబర్స్ సీడీఆర్, ఐఎంఈఐ నంబర్స్తో ప్రశ్నించనున్నట్లు సమాచారం.
రాష్ట్రానికి చెందిన ఏడుగురు నిరుడు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీ వరకు మొత్తం 43 ఫోన్లను, 8 సిమ్లను మార్చినట్లు గుర్తించింది. ఈ ఫోన్లను ఏం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. పాలసీ మార్పు కోసం డిస్కషన్ జరిగిన తేదీలు, మొబైల్ ఫోన్లను మార్చిన తేదీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది.
ఇందుకోసం ఐటీ రంగ నిపుణలతో డాటా కలెక్ట్ చేస్తున్నది. మొబైల్ సర్వీసెస్ సర్వర్లో ఉన్న డేటాను ఇప్పటికే రిట్రీవ్ చేసినట్లు సమాచారం. ఇందులో ఫైనల్ పాలసీ ఫార్ములాను వాట్సాప్లో షేర్ చేసుకున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తరువాత ఆగస్ట్ 17న సీబీఐ కేసు రిజిస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఈడీ గుర్తించింది. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు సేకరించేందుకు జరిగిన సమావేశాల ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లు సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిసింది. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు బదిలీ అయ్యాయని ఈడీ అనుమానిస్తోంది.
ఇందులో భాగంగానే బోయినపల్లి అభిషేక్, ఎమ్మెల్సీ కవిత, శరత్చంద్రారెడ్డి పేర్లను అమిత్ అరోరా ప్రస్తావించినట్లు ఈడీ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది. ఆధారాలు లభించకుండా ఫోన్లను ధ్వంసం చేయడం లేదా మార్చారని వివరించింది. రికవరీ చేసిన ఫోన్స్ ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టనుంది.
అమిత్ అరోరా వెల్లడించిన వివరాలతో రాష్ట్రానికి చెందిన ఏడుగురి వివరాలు తెలిశాయి. ఇందుకు సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ పూర్తి చేసినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటికే బోయినపల్లి అభిషేక్, శరత్ చంద్ర రెడ్డిని అరెస్టు చేసి విచారించిన సంగతి తెలిసిందే.
ఇక మిగతా ఐదుగురికి కూడా వారం రోజుల వ్యవధిలో షెడ్యూల్ ప్రకారం నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. వీరిని ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
More Stories
ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
ఈడీ విచారణకు మూడోసారీ మొయిత్రా డుమ్మా