భారతదేశం తన శరీరంలో అంతర్భాగమన్నసుంద‌ర్ పిచాయ్

భారతదేశం తన శరీరంలో అంతర్భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తన వెంటే తీసుకెళ్తానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మ భూషణ్ అవార్డును ఆయన తాజాగా అందుకున్నారు. 
 
2022 ఏడాదికిగానూ సుందర్ పిచాయ్‌కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ అవార్డును సుందర్ పిచాయ్‌కి అందజేశారు.
 
భారత దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ను తనకు అందించడంపై సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ గౌరవం నాకు కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారత్‌ నాలో ఒక భాగం. ఎక్కడికెళ్లినా ఆ వారసత్వాన్ని నాతోనే తీసుకెళ్తా’ అని తెలిపారు.
`నా తల్లిదండ్రులు, నా ఎదుగుదలకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని పిచాయ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.