‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో ఒక అబద్దమని చెప్పినా సినిమాల నుండే తప్పుకుంటా

‘‘ద కశ్మీర్‌ ఫైల్స్‌” సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్‌ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకుంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఉద్వేగంగా సవాల్ చేశారు. ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ గానీ.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుక్డేగ్యాంగ్‌, అర్బన్‌ నక్సల్స్‌ లేదా ఉగ్రవాదులు కశ్మీర్‌ ఫైల్స్‌ అబద్ధమని నిరూపించాలని సవాల్‌ విసిరారు.

 గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫీ)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇజ్రాయెల్‌ దర్శకుడు, ఇఫీ జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో విమర్శలు చేశారు. ‘‘ఈ సినిమాను వీక్షించి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి లాపిడ్‌ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ మంగళవారం ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలపై తాను వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు.

‘‘నిజం అనేది చాలా ప్రమాదకరమైనది. నిజం అనేది ప్రజలను అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కశ్మీర్‌ ఫైల్స్‌ ముమ్మాటికీ నిజం. కల్పితం కాదు. కశ్మీరీ పండిట్లపై జరిగిన అత్యాచారాలు, ఊచకోతలు.. వారిని బలవంతంగా కశ్మీర్‌ వీడేలా పన్నిన పన్నాగం అంతా నిజం. అలా కశ్మీర్‌ను వీడిన 700 మంది బాధితులతో మాట్లాడాకే.. ఈ చిత్ర కథను రూపొందించా. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం.. ప్రతి డైలాగ్‌ నిజం నుంచి వచ్చినవే’’ అని ఆయన ఆ వీడియోలో తేల్చి చెప్పారు.

కశ్మీరీ పండిట్ల ఊచకోత, హిందూ మహిళలపై అత్యాచారాలు లాపిడ్‌ చెప్పినట్లు ప్రచారమో, అసభ్యమో కానేకాదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు కారణమైన యాసిన్‌ మాలిక్‌ జైల్లో ఉన్నాడని చెబుతూ కశ్మీర్‌ ఫైల్స్‌ అబద్ధమైతే అతడు తన నేరాన్ని ఎలా ఒప్పుకొంటాడని నిలదీశారు. ఇప్పటికీ కశ్మీర్‌లో హిందువులను కళ్ల ముందే చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటువంటి విమర్శలు తనకు కొత్తకాదని అంటూ తరచూ ఉగ్రవాద సంస్థలు, అర్బన్ నక్సల్స్, దేశాన్ని మరోసారి విభజించాలని అనుకునేవారు ఈ విధమైన విమర్శలు చేస్తూనే ఉన్నారని అగ్రనిహోత్రి తెలిపారు. “అయితే,కాశ్మీర్ ను భారత దేశం నుండి విడదీయాలని వాదనకు మద్దతు ఇచ్చే స్వరాలు భారత ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమం వేదికపై నుండి వినిపించడం నాకు ఆశ్చర్యం కలిగించింది” అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
 
భారత దేశంలోని కొందరు వ్యక్తులు దీనిని దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకొనే ప్రమాదం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఎల్లప్పుడూ భారత దేశానికి వ్యతిరేకంగా నిలబడుతున్న ఈ వ్యక్తులు ఎవ్వరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు, ఊచకోత జరగలేదని చెప్పేవారు ఎప్పటికి నన్ను మాట్లాడకుండా చేయలేరు. జై హింద్” అంటూ ముగించారు.