నీటి రంగంలో ఐదేళ్లలో 210 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు

2019 నుండి 2024 వరకు నీటి రంగంలో ప్రపంచంలోనే అత్యధికంగా పెట్టుబడుల 210 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. ఇషా లీడర్‌షిప్‌ అకాడమీ ప్లnాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 11వ ఎడిషన్‌లో మూడవ రోజు మంత్రి ప్రసంగిస్తూ జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని వివరించారు.

ఇది 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెబుతూ  నీటిని నిర్వహించడం  సమిష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ దిశలో మనమందరం కలిసి పనిచేయాలని చెప్పారు.  జల్‌ జీవన్‌ మిషన్‌ డ్యాష్‌బోర్డ్‌ ప్రకారం, 2019లో 16 శాతం భారతీయ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్‌కు ప్రాప్యత ఉండగా, అది ఇప్పుడు 54 శాతానికి పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ గ్రామీణ సమాజాన్ని నిమగ్నం చేస్తుందని పేర్కొన్నారు. వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుందని అంటూ ప్రతి గ్రామంలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉన్న 21 మందితో కూడిన నీరు, పారిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేయడం ప్రారంభించిందని షెకావత్‌ వివరించారు.

”మేము గ్రామాల్లోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాము. అన్ని ప్రాథమిక 12 పారామితులపై నాణ్యతను పరీక్షించడానికి వారికి చేతితో పట్టుకునే పరికరాలను అందించాము. వారు తమ గ్రామంలోని నీటిని తరచుగా కనీసం ఒక నెలలో లేదా ఒక వారం వ్యవధిలో పరీక్షించగలరు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సెన్సార్‌ ఆధారిత పరిష్కారాలకు సహకారం అందించడానికి భారతీయ స్టార్ట్‌-అప్‌లను ఆహ్వానిస్తున్నాము” అని వివరించారు.