ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత

భారతీయ చిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యం లాంటి నటుడిని కోల్పోయింది. తన నటనతో ఎంతో మంది భారతీయ ప్రేక్షకులను రంజింప చేసిన మరాఠీ, హిందీ, రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే ఇకలేరు. ఈయన వయసు 77 యేళ్లు.  ఈయన గత కొన్ని రోజులుగా పూనెలో ఉన్న దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో డాక్టర్లు ఈయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 
 
ఇక ఈయన శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన చనిపోయినట్టు డాక్టర్లు కాసేపటి క్రితమే ప్రకటించారు. విక్రమ్ గోఖలే కుటుంబం మొత్తం చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్లే ఉన్నారు. ఈయన నాన్న చంద్రకాంత్ గోఖలే తొలి తరం రంగస్థల నటుడిగా రాణించారు. ఈయన కూడా పలు చిత్రాల్లో నటించారు. విక్రమ్ గోఖలే 1945 నవంబర్ 15న అప్పటి బాంబే ప్రెసిడెన్సీ, ప్రస్తుతం మహారాష్ట్రలోని పూనెలో జన్మించారు.

1971లో 26వ ఏట అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పర్వానా సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసారు. గోఖలే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పలు మరాఠీ, బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. 1990లో అమితాబ్ హీరోగా వచ్చిన అగ్నిపథ్‌, 1999లో సల్మాన్‌, ఐశ్వర్యారాయ్ బచ్చన్ జంటగా నటించిన హమ్ దిల్‌ దే చుకే సనమ్‌ తదితర సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

‘దే ధనాదన్’, ,. భూల్ భులయ్య, మిషన్ మంగళ్, ఖుదా గవా సినిమాలలో ఈయన నటనకు మంచి మార్కులే పడ్డాయి.  ఈయన గ్రేట్ గ్రాండ్ మదర్ దుర్గా భాయ్ కామత్ తొలి తరం నటిగా ప్రేక్షకులను అలరించారు. ఈయన గ్రాండ్ మదర్ కమల్ భాయ్ గోఖలే కూడా తొలి తరం మరాఠీ, బాలీవుడ్  చిత్రాల్లో అలరించారు.

ఇక ఈయన తమ్ముడు మోహన్ గోఖలే కూడా ‘మిస్టర్ యోగి’ వంటి దూరదర్శన్‌లో ప్రసారమయిన సీరియల్స్‌లో నటించారు. విక్రమ్ గోఖలే ఓ వైపు సినిమాలు.. మరోవైపు నాటకాలు.. ఇంకోవైపు టీవీ సీరియల్స్‌లలో తనదైన నటనతో మెప్పించారు.

ముఖ్యంగా సింఘాసన్, విరుధ్,జీవన్ సాథి, అటు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. 2010 మరాఠీ సినిమా అఘాత్ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. 2012లో మరాఠీ సినిమా అనుమతిలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును దివంగత ఇర్ఫాన్ ఖాన్‌తో షేర్ చేసుకున్నారు. ఈయన భారతీయ సినిమా పితామహుడిగా పేరు తెచ్చుకున్న దాదాసాహెబ్ ఫాల్కే కు వరుసకు మనవడు అవుతాడు.