మల్లారెడ్డిపై ఐటీ దాడుల్లో ల్యాప్ ట్యాప్ ఏమైంది?

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ అధికారుల దాడుల సందర్భంగా ఓ ల్యాప్ టాప్ తప్పిపోవడం కలకలం రేపుతోంది. ఆ ల్యాప్ టాప్ ఐటీ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ కు చెందినదిగా గుర్తించారు. అర్ధరాత్రి సోదాల సమయంలో ఐటీ అధికారి రత్నాకర్ దగ్గర నుంచి మల్లారెడ్డి అనుచరులు ల్యాప్ టాప్ లాక్కెళ్లారు.
 
 ఇదే విషయంపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఐటీ అధికారి రత్నాకర్  మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పీఎస్ లో ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ల్యాప్ టాప్ ను గేటు దగ్గర పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దర్ని ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులు ప్రశ్నించారు. 
 
పోలీస్ స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ తీసుకెళ్లాలని ఐటీ అధికారులను పోలీసులు కోరారు. అయితే తన ల్యాప్ టాప్ లో ఐటీ దాడులకు సంబంధించి ముఖ్యమైన వివరాలు ఉన్నాయని ఐటీ అధికారి రత్నాకర్ అంటున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ తనది కాదని చెబుతున్నారు. 
 
దీంతో ఆ ల్యాప్ టాప్ ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే అధికారులు ల్యాప్ టాప్ మర్చిపోతే, తామే పోలీస్ స్టేషన్ లో ఇచ్చి వచ్చామని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు.
బోయిన్ పల్లి పీఎస్ లో నమోదైన ఈ కేసులను దుండిగల్ కు బదిలీ చేశారు.
విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వస్తువులను బలవంతంగా లాక్కెళ్లారని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద మల్లారెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు . మరోవంక, తమపై దౌర్జన్యం చేశారని మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ అధికారి రత్నాకర్ పై 384 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సోదాలు ముగిసిన అనంతరం పంచనామా పత్రాలపై సంతకాలు చేయించేందుకు ఐటీ అధికారులు దాదాపు మూడు గంటల పాటు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి పంచనామా పత్రాలపై సంతకం చేయకపోవడంతో అధికారులు ఆసుపత్రిలో ఉన్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డితో సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ పంచనామా పత్రాలను మల్లారెడ్డికి అందించారు.