అస్సాం, మేఘాలయ సరిహద్దుల్లో కాల్పులు.. ఆరుగురు మృతి

అస్సాం, మేఘాలయ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులోని పశ్చిమ జైంతియా హిల్స్‌లోని ముఖోహ్  జిల్లాలో మంగళవారం  చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

కలప స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అడ్డుకోవడం వల్లనే కాల్పులు జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. చనిపోయిన వారిలో అస్సాంకి చెందిన ఒక ఫారెస్ట్‌ గార్డు, ముగ్గురు ఖాసీ వర్గీయులు ఉన్నారు. దీంతో ఏడు జిల్లాల్లో 48 గంటల పాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మా తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుండి నెట్‌ సర్వీసులు నిలిపివేయనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం పేర్కొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయలోని పశ్చిమ జయంతియా హిల్స్‌లోని ముక్రోహ్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాల్పుల జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును పోలీసులు అడ్డుకోవడంతో కాల్పులు జరిపారు. స్మగ్లింగ్‌ ముఠా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించింది.

పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారని పశ్చిమ కర్బీ ఆంగ్లోంగ్‌ ఎస్పీ ఇమ్దాద్‌ అలీ చెప్పారు. అక్రమ కలపతో వెళ్తున్న ట్రక్కును అటవీశాఖ అడ్డగించడంతో కాల్పులు జరిగినట్లు ఆయన తెలిపారు.  ఈ క్రమంలో వాళ్లు పారిపోయే క్రమంలో పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఫారెస్ట్‌ సిబ్బంది జిరికెండింగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత మేఘాలయ నుండి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఫారెస్ట్‌ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పేర్కొన్నారు. 

ఇలాఉండగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో మాత్రం కాల్పులు రెండు గ్రూపుల మధ్య జరిగినట్లుగా తెలుస్తున్నది. అసోం-మేఘాలయ సరిహద్దు వెస్ట్ కర్బీ అంగ్లాంగ్‌లోని జిరికిండింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు ఖాసీ వర్గానికి చెందిన వారున్నారు.