ఇ-కామర్స్ సైట్లలో వస్తువులు కొనే వారు చాలా మంది ఆ వస్తువు రివ్యూలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు. వాటి ఆధారంగానే చాలా మంది వాటికి కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. దానితో చాలా ఇ-కామర్స్ సైట్లలో తప్పుడు, నకిలీ సమీక్షలు పోస్ట్ చేస్తూ, తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు అడ్డదారిలో ఫేక్ రివ్యూలను పెడుతుంటాయి. వీటిని చూచి వినియోగదారులు మోసపోతున్నారు.
ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి ఈ నెల 25 నుంచే అమల్లోకి వస్తాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఇ-కామర్స్ సంస్థలైన జొమాటో, సిగ్గ్వి, రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, గూగుల్, మెటా, మీషో కంపెనీలతో దీనిపై జూన్లో ఒక కమిటీగా ఏర్పడ్డాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇ-కామర్స్ సంస్థలు సమీక్షలు ఎలా ఉండాలన్న దానిపై ఒక కోడ్ను రూపొందించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఫిల్టరింగ్, కంట్రోల్ టూల్స్ను రూపొందించాల్సి ఉంటుంది. రివ్యూలు ఏ మేరకు సరైనవో దీని ద్వారా అంచనా వేస్తారు. వీటిని పోస్ట్ చేసిన వారి వివరాలను ఈ -మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ వంటి వివరాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది.
అన్ని ఆన్లైన్ సంస్థలకు వినియోగదారుల రివ్యూలు ఇచ్చేందుకు ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఫిర్యాదులను నమోదు చేసేందుకు 15 రోజుల్లోగా బీఐఎస్ కూడా కన్ఫర్మిటీ అసెస్మెంట్ స్కీమ్ను ప్రారంభించనుంది. మార్గ దర్శకాలను ప్రారంభంలో ఐచ్చికంగా అమలు చేస్తారు. తర్వాత కాలంలో ఇవి తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.
ప్రమాణాలను కంపెనీలు ఉల్లంఘిస్తే వినియోగదారుల హక్కుల ఉల్లంఘనగానూ, అనైతిక వ్యాపార విధానాలను అమలు చేస్తున్నట్లుగా భావిస్తామని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఇలాంటి వాటికి పాల్పడిన కంపెనీలపై వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ఫ్లైన్కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
తప్పుుడు సమీక్షలు, ఫేక్ సమీక్షలను, చెల్లింపుల సమీక్షలను నిరోధించాల్సిన బాధ్యత ఇకపై కంపెనీలపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇ-కామర్స్ సైట్స్ ఇక నుంచి రివ్యూ అడ్మినిస్ట్రేటర్ను నియమించుకోవాల్సి ఉంటుంది. సైట్లో వచ్చే సమీక్షలకు ఆయనే బాధ్యడుగా ఉంటారు. ఇలా సమీక్షలు ఇచ్చే వారు వారి పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా ఇచ్చిన వివరాలను గోప్యతను కావాడాల్సిన బాధ్యత కూడా అడ్మినిస్ట్రేటర్పై ఉంటుంది. పెయిడ్ సమీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచురించకూడదు. ఇందులో వాడే భాషపై కూడా నియంత్రణ ఉండాలి. ఇలా ప్రొడక్ట్, సర్వీస్లకు సంబంధించి వచ్చే సమీక్షలపై మార్గదర్శకాలు జారీ చేసిన మొదటి దేశం మనదేఅని ఆయన తెలిపారు. ప్రధానంగా వినియోగ వస్తువులు, ట్రావెల్, టూరిజం, రెస్టారెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!