ఉక్రెయిన్‌లో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ పర్యటన

బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి రిషి నునాక్‌ ఉక్రెయిన్‌లో పర్యటించారు. కైవ్‌ చేరిన అనంతరం ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. రష్యా యుద్ధం నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది.  రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు తమ దేశం తరపున మద్దతు కొనసాగింపునకు సంకేతంగా రిషి సునాక్‌ ఉక్రెయిన్‌లో పర్యటించారు.
బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ గత నెలలో అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్‌ పర్యటన తొలి కావడం విశేషం. కైవ్‌ చేరుకున్న రిషి సునాక్‌.. అక్కడ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. రష్యా దురాక్రమణ యుద్ధంలో ఉక్రెయిన్‌ను బ్రిటన్‌ అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుందని సునాక్‌ హామీ ఇచ్చారు.

 ఉక్రెయిన్‌ ప్రజలకు కావాల్సిన ఆహారం, ఔషధాలు అందుబాటులో ఉండేలా బ్రిటన్‌ మానవతా సహాయాన్ని అందించడాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. రష్యా యుద్ధాన్ని నిరంకుశత్వానికి పరాకాష్టగా సునాక్‌ అభివర్ణించారు.ఉక్రెయిన్‌కు 50 మిలియన్‌ పౌండ్స్‌ విలువ చేసే 125 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌లు, డజన్ల కొద్దీ రాడార్లు, యాంటీ డ్రోన్‌ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సాంకేతికతను అందించనున్నట్లు రిషి సునాక్‌ ప్రకటించారు.

అలాగే, ఉక్రెయిన్‌ సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ముందుంటామని అభయమిచ్చారు. ఇందుకు కావాల్సిన ప్రత్యేక సహాయాన్ని అందించేందుకు నిపుణులైన ఆర్మీ మెడిక్స్‌, ఇంజినీర్లను ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు ప్రకటించారు.