ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించినా ఆసక్తి లేదన్న ట్రంప్!

ఎట్ట‌కేల‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు. అయితే తనను నిషేధించిన ట్విట్టర్‌లోకి తిరిగి రావడానికి ఆసక్తి లేదని డొనాల్డ్ ట్రంప్ నిరాసక్తత వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో తిరిగి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పెదవి విరిచారు. 
 
తన సొంత మీడియా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌తో తాను కట్టుబడి ఉంటానని, ఇది ట్విట్టర్ కంటే మెరుగైన యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను కలిగి ఉందని, అద్భుతంగాపనిచేస్తోందని పెక్రోన్నారు.
 
కాగా ట్విట్ట‌ర్ అధినేత ఎలాన్ మ‌స్క్ డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు వెల్ల‌డించారు. ట్విట్టర్ లో ట్రంప్ తిరిగి రావడానికి సంబంధించి మస్క్ పోలింగ్ నిర్వహించగా, ఈ పోల్‌లో ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేశారు. దాంతో, ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. 
 
ప్రజల స్వరం పేరిట ‘అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌ ను తిరిగి తీసుకు రావాలా?’ అంటూ నిర్వహించిన పోల్ లో పాల్గొన్న వారిలో 51.8 శాతం మంది మద్దతు ఇచ్చారని తెలిపారు. పోలింగ్ ఫలితాలను ట్వీట్ లో షేర్ చేశారు. అదే సమయంలో ‘ప్రజల స్వరం, దేవుని స్వరం’ అని అర్థం వచ్చే లాటిన్ పదాన్ని జోడించారు. 
24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో కోటీ 50 లక్షల 85వేల 458 మంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ట్రంప్‌ ఎకౌంట్‌ ట్విట్టర్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది జనవరిలో అమెరికాలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. 
 
వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని వార్తలు రావడంతో ట్రంప్ ఖాతాలను తొలగిస్తున్నట్టు ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రకటించాయి. అయితే, మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న వెంటనే ట్రంప్ సహా పలువురు ప్రముఖుల ఖాతాలను పునరుద్ధరించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.