నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి, ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పోలీసు డైరెక్టర్ జనరల్ను కోరారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసంపై దాడి చేసి, ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తమిళిసై పేర్కొన్నారు. ఎంపీ నివాసంలో కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం సబబు కాదని, ప్రాధాన్యతా ప్రాతిపదికన డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె తెలిపారు.
ఇలా ఉండగా, ఒక ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే రక్షణ కల్పించకుండా డీజీపీ ఏం చేస్తున్నారని అరవింద్ నిలదీశారు. గతంలో కూడా ఎంపీలపై దాడులు జరిగాయని.. తనపై దాడి జరగడం కొత్తేం కాదని చెప్పారు. ఎంపీలపై ఎన్నోసార్లు దాడులు జరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు.
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్, ఇంటి పనిమనిషిపై దాడి చేసినట్లు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూలకుండీలు, దేవుడి ఫొటోలు ధ్వంసం చేసినట్లు ఆమె చెప్పారు.
రాష్ట్ర వ్యాప్త నిరసనలు
ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు, వివిధ మోర్చాల నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలను తిప్పి కొట్టాలని, నిరసనలు కొనసాగించాలని వారికి సూచించారు.
సీఎం కేసీఆర్ నియంత పాలనను నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఎంపీ అర్వింద్ తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ ఆఫీసుకు వెళ్లారు.
ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే డీజీపీని కలుస్తామని, ఆయన కూడా స్పందించకుంటే హైకోర్టు ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు.
More Stories
సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు