కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్ లోని డార్జిలింగ్ లో జాతీయ రహదారుల శంకుస్థాపనకు హాజరైన సమయంలో స్టేజిపై ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు.  పక్కనన్న గ్రీన్ రూమ్ లోకి ఆయనను విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. 
 
అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. ఆయనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి సిలిగురి నుంచి సీనియర్ డాక్టర్ ను ఆగమేఘాలపై రప్పించారు. ఆయన ఆధ్వర్యంలో చికిత్స కొనసాగింది. 
 
ఆ తర్వాత డార్జిలింగ్ బిజెపి ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది.
గడ్కరీ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  వాకబు చేశారు. ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  కూడా గడ్కరీ ఆరోగ్యంపై ఆరా తీశారు. సిలిగురిలో  రూ. 1206 కోట్లతో చేపట్టే జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ నేడు శంకుస్థాపన చేశారు.
 తీస్తా నదిపై రూ. 1100 కోట్లతో త్వరలో వంతెన నిర్మిస్తామని కూడా గడ్కరీ హామీ ఇచ్చారు. రహదారుల నిర్మాణం కారణంగా సిక్కిం, డార్జిలింగ్, భూటాన్‌లకు కనెక్టివిటీ పెరుగుతుందని, ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని గడ్కరీ చెప్పారు.