2019 లోక్ సభ ఎన్నికలలో నిజామాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఓటమి కవిత ఓటమి వెనుక టీఆర్ఎస్ అధిష్టానం ఉందనే ఆరోపణలు ఉన్నాయని మాజీ ఎంపీ, బిజెపి నేత బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. కవిత టీఆర్ఎస్లో మరో అధికార కేంద్రం కావొద్దన్న కారణంతో ఆమెను ఓడించారని ఆయన వెల్లడించారు.
తమ కుమార్తెను కూడా బీజేపీలో చేరమని బెదిరించారని కేసీఆర్ చేసిన ఆరోపణ పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం కూతురు పేరును వాడుకోవడం సీఎం కేసీఆర్కే చెల్లిందని ధ్వజమెత్తారు. కవితను ఆహ్వానించడం కాదు.. టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకోమని స్పష్టం చేశారు.
సొంత ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం జరిగిన టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఎమ్యెల్యేలు ఎవరేమి చేస్తుంటారో తనకు తెలుస్తూనే ఉంటుందని కేసీఆర్ పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.
ఎమ్యెల్యేలందరికి తిరిగి సీట్లు ఇస్తామని అంటూ వారు పార్టీ వదిలి వెళ్లకుండా కట్టడి చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ తొంభై శాతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవరని ఆయన జోస్యం చెప్పారు. ఫామ్హౌస్ ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు జడ్జితోనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు నిర్బంధించారో సీఎం కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. సిట్ విషయంలో బీజేపీ ఆరోపణలే నిజమయ్యాయని చెబుతూ, అందుకే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో కేసు విచారణ జరగడం పట్ల హర్షం ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీసీలు అణిచివేతను గురయ్యారని చెప్పారు. బీసీలను ఆర్థికంగా అణిచివేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. గత 8 ఏళ్లలో బీసీ ఫెడరేషన్స్కు ప్రభుత్వం కేవలం రూ. 230 కోట్లే కేటాయించిందన్నారు. బీసీ ఫెడరేషన్స్కు చట్టబద్ధత కల్పించాలని..లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ వారే
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు