మాజీ ఎమ్మెల్యే మందాడి కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి (83) తుదిశ్వాస విడిచారు. 2004 ఎన్నికల్లో నాటి హన్మకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మందాడి విజయం సాధించారు. 
 
ఆ తర్వాత వృద్ధాప్యం ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతే కాకుండా 2009 ఎన్నికలకు కాస్తంత ముందుగా టీఆర్ఎస్ ను వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ నియోజకవర్గం రద్దు అయిపోయింది.
 
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని మారుమూల గ్రామం ఇప్పగూడలో జన్మించిన ఆయన  భారతీయ జనసంఘ్ తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.  ఆ తర్వాత జనతా పార్టీలో, బీజేపీ లలో క్రియాశీలకంగా పనిచేశారు. బీజేపీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడిన ఆయన టీఆర్ఎస్ లో చేరారు.
 టీఆర్ఎస్ తరఫుననే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయ నేతగానే కాకుండా గాయకుడు, రచయిత, కవిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందాడి సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా పాటలు రాసి అసెంబ్లీ వేదికగా పాడారు.
మందాడి సత్యనారయణ మృతి పట్ల కేంద్ర మంత్రి  జి కిషన్ రెడ్డి, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్,  తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం ప్రకటించారు.