లిక్కర్‌ స్కామ్‌ లో విజయసాయిరెడ్డి దగ్గరి బంధువు అరెస్ట్

దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను ఈడీ అరెస్టు చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్టు చేశారు.  వారిలో శరత్ చంద్రారెడ్డి  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయానా అన్న కావడం గమనార్హం. 
 
అలాగే తెలంగాణకు చెందిన వినయ్‌బాబును కూడా అరెస్ట్ చేసింది. కాగా, శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ వెల్లడించింది. రెండు రోజుల నుంచి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను అధికారులు విచారిస్తున్నారు.
 
సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపునకు డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. 
 
మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌ లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇది వరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.