రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగుతాయి

రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగుతాయి

రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగుతాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు దేశ ప్రయోజనాలకు చాలా ముఖ్యమని జయశంకర్‌ చెప్పారు. 

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో, చమురు ఎక్కువగా దిగుమతి చేసుకొనే దేశాలలో మూడవదైన భారత్ తమ ప్రజలకు అంతర్జాతీయంగా మెరుగైన ధరకు చమురు పొందే విధంగా చూడడం తమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. 

ఈ సంవత్సరం ఇప్పటికే ఆయన రష్యా విదేశాంగ శాఖ మంత్రితో ఐదు సార్లు సమావేశమయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత మొదటిసారిగా ఆయన మాస్కో పర్యటనకు వెళ్లారు. రష్యా చమురు ధరలపై నియంత్రణ విధించాలని అమెరికా కోరుతోంది. ఈ దిశగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఈ వారంలోనే ఢిల్లి వచ్చి చర్చలు జరిపారు.

అక్టోబర్‌లో మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల కంటే చైనా అత్యధికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి మందు మన దేశ దిగుమతుల్లో రష్యా చమురు వాటా కేవలం 2 శాతంగానే ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్‌ నాటికి 23 శాతానికి చేరింది.

ప్రపంచంలో చమురు ఎక్కువగా దిగుమతి చేసుకొనే మూడవ దేశంగా తమ ప్రజలకు తక్కువ ధరకు సరఫరా చేసేందుకు అంతర్జాతీయంగా తమ సౌలభ్యం కూడా చూసుకొంటామని అంటూ రష్యా నుండి ఎక్కువగా చమురు కొనడానికి  గల కారణాలను వివరించారు. 

విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు, వ్యవసాయ, పెట్రోలియం, సహాజ వాయివు, పోర్టులు, షిప్పింగ్‌, ఆర్ధిక, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, వాణిజ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్లింది. చర్చల అనంతరం రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలి

ఇలా  ఉండగా,రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలని భారత్ మరోసారి ప్రకటించింది. మాస్కో పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సమావేశంలో ఈ యుద్ధం గురించి చర్చించామని, యుద్ధం ప్రారంభం నుండి తాము రెండు దేశాలతో చర్చలు జరుపుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. భారత్ ఎప్పుడు చర్చలు, దౌత్యం, శాంతి కోసం చోస్తుందని స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పై ఉందని జైశంకర్ తెలిపారు. కరోనా మహమ్మారి, ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య ఇబ్బందులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి సవాళ్లు తమ ముందున్నాయని జైశంకర్ చెప్పారు . 
 
భారత్, రష్యా మధ్య కలపరీక్షకు నిలిచినా బలమైన సంబంధం కొనసాగుతోందని స్పష్టం చేశారు.  పాశ్చాత్య దేశాలు రష్యాతో వాణిజ్య సంబంధం తెంచుకున్నా  తాము చమురు కొనుగోలు చేస్తున్నామని గుర్తు చేశారు . అంతర్జాతీయ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చర్చించామని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ప్రకటించారు.