అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ సరైందే.. సుప్రీం

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10శాతం కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. ఈ రిజర్వేషన్లను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ విషయంపై దాఖలైన పలు పిటిషన్లపై ఇటీవల విచారణ ముగించిన సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. 
 
వీరికి 10 శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని సుప్రీంకోర్టు విసృత ధర్మాసనం తెలిపింది. ఇందులో ఎలాంటి వివక్ష లేదని చెప్పింది.
 
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై 3:2తో ధర్మాసనం తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లను ధర్మాసనంలోని జస్టిస్‌ దినేశ్ మహేశ్వరి, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేబీ పార్దివాలా సమర్థించగా, సీజేఐ జస్టిస్‌ యు.యు. లలిత్‌, మరో న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర భట్ వ్యతిరేకించారు.
 
ఈడబ్ల్యూఎస్‌లకు 10శాతం కోటా కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ  రాజ్యంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరీ తీర్పు వెలువరించారు. ఈ రిజర్వేషన్లు సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడం లేదని, అంతేగాక, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదని వ్యాఖ్యానించారు.
 
ఈ రిజర్వేషన్‌ కేటాయించడంలో ఎలాంటి వివక్ష లేదని జస్టిస్‌ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. వీరిద్దరి తీర్పులతో జస్టిస్‌ జేబీ పార్దివాలా ఏకీభవించారు. అయితే, జస్టిస్‌ రవీంద్రభట్‌ మాత్రం వీరి అభిప్రాయాలను వ్యతిరేకించారు. 
 
ఈడబ్ల్యూఎస్‌లకు 10శాతం కోటా సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై నిర్ణయించిన 50శాతం పరిమితిని దాటుతుందని జస్టిస్‌ భట్‌ అన్నారు. దీన్ని సీజేఐ జస్టిస్‌ యు.యు. లలిత్‌ కూడా అంగీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది.
 
103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై 1992 సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటి ఈ కోటాను ఎలా ఇస్తారంటూ పలువురు పిటిషనర్లు ప్రశ్నించారు. 
 
ఇది రాజ్యాంగం మూల స్వరూపాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సమర్థించింది.