74 శాతం వృద్థితో ఎస్‌బిఐకు రూ.13,264.62 కోట్ల నికర లాభం

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.13,265 కోట్ల స్టాండ్‌లోన్‌ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.7,627 కోట్ల లాభంతో పోలిస్తే 74 శాతం వృద్ధిని కనబరిచింది.
బ్యాంక్‌ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, అధిక వడ్డీ ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. జూలై-సెప్టెంబర్‌ మధ్యకాలానికి బ్యాంక్‌ రూ.88,734 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇది రూ.77,789.09 కోట్లుగా ఉన్నది.
 
 ఆ బ్యాంక్‌ చరిత్రలో ఏ మూడు మాసాల కాలంలోనూ ఈ స్థాయి లాభాలను ఆర్జించ లేదు. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.7,626.57 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.77,689.09 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గడిచిన క్యూ2లో 14 శాతం పెరిగి రూ.88,733.86 కోట్లకు చేరింది. 
 
క్రితం సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 13 శాతం ఎగిసి రూ.35,183 కోట్లకు చేరింది. అడ్వాన్సులు 19.93 శాతం పెరిగి రూ.25.30 లక్షల కోట్ల నుంచి రూ.30.35 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు 9.99 శాతం వృద్థితో రూ.38.09 లక్షల కోట్ల నుంచి రూ.41.9 లక్షల కోట్లకు పెరిగాయి.

2022-23 క్యూ2లో ఎస్‌బిఐ స్థూల నిరర్థక ఆస్తులు 3.52 శాతానికి పరిమితమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 4.9 శాతం జిఎన్‌పిఎ నమోదయ్యింది. నికర నిర్థక ఆస్తులు 1.52 శాతం నుంచి ఏకంగా 0.8 శాతానికి దిగిరావడం విశేషం. 

 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం (ఆరు మాసాల్లో)లో బ్యాంక్‌ నికర లాభాలు 37 శాతం పెరిగి రూ.19,333 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో రూ.14,131 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ2లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.66,379 కోట్లకు చేరడంతో మెరుగైన ఫలితాలు ప్రకటించింది.