కాపీరైట్‌ యాక్ట్‌ కింద రాహుల్‌ గాంధీపై కేసు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది.

యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్‌-2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్‌ఆర్‌టీ సంస్థ కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్‌ గాంధీ, సుప్రియా శ్రీనాథ్‌, జైరామ్‌ రమేశ్‌పై కేసు పెట్టింది.

కేజీఎఫ్‌-2 హక్కుల కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశామని తెలిపింది. భారత్ జోడో యాత్ర కోసం తమ అనుమతి లేకుండానే పాటలను వాడుకుందని సదరు సంస్థ ఆరోపించింది. భారత్‌ జోడో యాత్ర ప్రచారం కోసం రూపొందించిన వీడియోలకు తమ అనుమతి లేకుండా కేజీఎఫ్‌-2 హిందీ పాటలను వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.

సెక్షన్ 403 (దురుద్దేశ్యంతో ఆస్తుల దుర్వినియోగం), 465 (ఫోర్జరీ), 120 (జైలు శిక్షార్హమైన నేరానికి పాల్పడేలా డిజైన్‌ను దాచిపెట్టడం)  సెక్షన్‌ల కింద కాంగ్రెస్ పార్టీతో పాటు, ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ  34 (సాధారణ ఉద్దేశ్యం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66, కాపీరైట్‌ల చట్టం, 1957లోని సెక్షన్ 63 ప్రకారం కూడా నమోదు చేశారు.