కాపులకు 5 శాతం రిజర్వేషన్లకై కన్నా లేఖ 

కాపులకు 5 శాతం రిజర్వేషన్లకై కన్నా లేఖ 

రాష్ట్రంలోని కాపులకు 5 శాతం రేజర్వేషన్లు కల్పిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ లేఖ  వ్రాసారు.  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎ్‌స)కు ఉన్న 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు వర్తింపజేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం కూడా చేశారని తెలిపారు.

అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడంతో కాపులు 5 శాతం రిజర్వేషన్లని కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో 2019 జూలై 30వ తేదీన లేఖ ద్వారా సీఎం జగన్‌కి నివేదించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ లేఖను గుర్తు చేస్తూ తాజాగా మరో లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపారు.

ప్రభుత్వాలు నియమించిన అనేక కమిటీలు, కమిషన్లతోపాటు మంజునాథ కమిటీ కూడా కాపు, బలిజ, ఒంటరి వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన సామాజికవర్గంగా గుర్తించిందని ఆయన చెప్పారు.  ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా కాపుల రిజర్వేషన్లను వైసిపి చేర్చినదని కన్నా ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16 ప్రకారం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించజాలదని ఆయన స్పష్టం చేశారు.  కాపు, బలిజ, ఒంటరి వర్గాల ప్రజలకు ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.