మూడు దేశాల మైనారిటీలకు భారత పౌరసత్వం

అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చి గుజరాత్‌లో నివసిస్తున్న హిందువులతోపాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం జారీ చేసింది. 

ఈ మూడు దేశాల నుంచి వచ్చి గుజరాత్‌లోని మెహసానా, ఆనంద్‌ జిల్లాల్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్దులు, జైనులకు 1955 నాటి పౌరసత్వం చట్టం కింద పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు కేంద్రం ఇచ్చింది. ఆ జిల్లాల్లో నివసిస్తున్న అటువంటి వారు ఆన్ లైన్  దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఆన్ లైన్ లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారని ఆ ప్రకటనలో వివరించారు. 

ఈ పౌరసత్వాన్ని1955 నాటి చట్టం కిందే మంజూరు చేస్తారు. 2019 నాటి పౌరసత్వ చట్ట సవరణ (సిఏఏ) కింద కాదని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఎన్‌ఆర్‌ఐలకు ఓటు హక్కుపై కేంద్రం హామీ

ఇలా ఉండగా,  ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), వలస కార్మికులకు ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారు కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని, రహస్య ఓటింగ్‌ను కాపాడుతూనే వారికి ఓటు హక్కు కల్పిస్తామని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి తెలిపారు. 
 
దాంతో ఈ విషయమై దాదాపు పదేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐలు, వలస కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ 2013లో లండన్‌లో నివసిస్తున్న నాగేందర్‌ చిందం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
 
 దీనిపై అధ్యయనానికి సుప్రీంకోర్టు 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 2018లో లోక్‌సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. రాజ్యసభలో ప్రవేశ పెట్టకపోవడంతో చట్ట రూపం దాల్చలేదు. తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు.