తిరుపతిలో మంగళవారం నుంచి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీ ప్రారంభించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
టోకెన్ల జారీ కౌంటర్లు, క్యూలైన్లు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని పున ప్రారంభిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు.
టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. టోకెన్ల జారీ ప్రక్రియలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు.
ఆధార్ నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టోకెన్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని ఈవో ధర్మారెడ్డి వివరించారు.
More Stories
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటు
చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం
పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు