చుండూరులో పరోక్షంగా ఓటమి అంగీకరించిన కేసీఆర్ 

కేసీఆర్ లో ఓటమి భయం కనిపిస్తోందని చెబుతూ మునుగోడులో ఓడిపోతామని పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చండూరు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ ఫిరాయింపులు, టీఆర్ఎస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. 

2014లో  ఆగస్టు 18న మాట్లాడిన మాటలనే మళ్లీ ఈరోజు మాట్లాడారని, అదే పార్టీ, అదే గుర్తు, అదే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన  విమర్శించారు.  9 ఏళ్లలో  మునుగోడుకు ఇచ్చిన  హామీలు అమలు చేయని నీవు15రోజుల్లో హామీలను అమలు చేస్తా అని అడుగుతున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.

కేసీఆర్ హామీలను మునుగోడు ప్రజలు నమ్మరని, కల్వకుంట్ల కుటుంబం మోసాలు ప్రజలందరూ అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.  మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం… వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ ఫాంహౌస్ కు పరిమితం కావడం ఖాయం అని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ కు లేదని, ఫిరాయింపులకు  కేరాఫ్ టీఆర్ఎస్ పార్టీ అని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఎఫ్ఐఆర్ లో డబ్బుల విషయం ఎందుకు పెట్టలేదని  కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

చండూరు వేదికగా కేసీఆర్ అబద్దాలు చెప్పారని పేర్కొంటూ గతంలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా మరోసారి అవే హామీలు ఇచ్చారని కేంద్ర మంత్రి  విమర్శించారు. నీ వెంట వచ్చిన నలుగురు నేతలలో నీ పార్టీ నుంచి గెలిచిన వారెంతమంది ఉన్నారని ఆయన  ప్రశ్నించారు. ప్రజలు తీర్చమని అడిగేది చిన్న చిన్న సమస్యలేనని చెప్పారు

చేనేత పై జీఎస్టీ 40లక్షల టర్నోవర్ ఉన్న కంపెనీలకేనని చెబుతూ మీకు జీఎస్టీ వేయొద్దని అనుకుంటే జీఎస్టీ కౌన్సిల్ లో ఎందుకు అభ్యంతరం తెలపలేదని కిషన్ రెడ్డి కేసీఆర్ ను నిలదీశారు.  ఫ్లోరైడ్ నిర్మూలన కోసం కేసీఆర్ చేసిన ఖర్చు కంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసిందని తెలిపారు. కేసీఆర్ కు దమ్ముంటే ఇది అబద్దమని చెప్పాలని సవాల్ చేశారు. 

కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అందుకోసం కేంద్రం రూ  800 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టుని నేనే పూర్తి చేస్తా అని చెప్పి ఇప్పుడు కేంద్రంపై నెపం పెడుతున్నారని విమర్శించారు. కేఆర్ఎంబీ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు డుమ్మాకొట్టారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక 8 ఏళ్లలో మునుగోడులో ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. 

‘‘ఢిల్లీ బ్రోకర్ లు అంటున్నావు… నీవు కూడా బ్రోకరిజం చేసే చేర్చుకున్నావా?  ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన మాకు లేదు. నీవే ముందు రద్దు చేసుకుని సానుభూతి పొందాలని భావిస్తున్నావు. నీపై సానుభూతి, నమ్మకం పోయింది. మీ ఎమ్మెల్యే లు మాకెందుకు… వందకోట్లు పెట్టేంత నీతిమంతులా వారు.?’’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

అసలు ఎవరు కొనేందుకు వచ్చారు?  ఎంత డబ్బు తెచ్చారో తేల్చేందుకు న్యాయస్థానానికి రావు, సీబీఐ రాష్ట్రానికి రాకుండా నిన్నటికి నిన్న జీవోలు తీసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. సీబీఐ రాష్ట్రానికి ఎందుకు రాకూడదో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

‘‘సీబీఐ.. ఈడీలకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? దేశంలో అత్యధిక పన్నులు వేసి పెట్రోల్ అమ్ముతున్న రాష్ట్రం తెలంగాణ కాదా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. పేదల నుంచి వేల కోట్ల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? తెలంగాణ లో పెట్రోల్ పై పన్నుతగ్గించి పేదలకు, యువకులకు న్యాయం చేస్తావా?’’ అంటూ  కిషన్ రెడ్డి కేసీఆర్ ను నిలదీశారు. 

మోటార్లకు మీటర్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినా  కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. మీటర్లు పెడితే..  మీ అవినీతిని లెక్కించేందుకు పెడతామని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ రాజ్యంలో బెల్టుషాపుల రాజ్యం నడుస్తోందని పేర్కొంటూ నీవు  ప్రధాని అయ్యి దేశమంతా బెల్టుషాపులు పెడతావా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడులో ఆర్టీసీ, విద్యా సంస్థల బస్సులను టీఆర్ఎస్ సర్కార్ మొబైల్ బార్లుగా మార్చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

భారతదేశాన్ని తక్కువ చేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని అంటూ భారతదేశాన్ని విషగురు అని అవమానిస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశంలో ఉన్న 100 కోట్లకు పైగా జనాభాను అవమానించడమే అని స్పష్టం చేశారు.