సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది

భారతదేశం సౌర, అంతరిక్ష రంగాలు “అద్భుతాలు చేస్తున్నాయని”  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వాటి విజయాలను చూసి ప్రపంచం మొత్తం “ఆశ్చర్యపోతోంది” అని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ  తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో, ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం అన్నది మన యువత దేశానికి ఇచ్చిన “ప్రత్యేక దీపావళి బహుమతి”గా అభివర్ణించారు. 

క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని మన దేశానికి ఇచ్చేందుకు ఇతర దేశాలు గతంలో తిరస్కరించాయని, ఆ తర్వాత భారతీయ శాస్త్రవేత్తలు మన దేశంలోనే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివ‌ృద్ధి చేశారని  ప్రధాని గుర్తు చేశారురు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డజన్లకొద్దీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తోందని చెప్పారు. 

ఇస్రో పదేళ్ళ క్రితం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జి  ఎస్ ఎల్ వి) ప్రాజెక్టును విజయవంతం చేసింది. క్రయోజెనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్‌వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించింది. అంతకుముందు దశాబ్దాలపాటు మన దేశంపై అమెరికా, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఆంక్షలు అమలవుతూ ఉండేవి. 

తాజాగా దీపావళికి ముందు 36 కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను విజయవంతంగా కక్ష్యలలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. మరో 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను త్వరలోనే ప్రయోగించబోతోంది. ఇస్రో ఇటీవల విజయవంతంగా ఉపగ్రహాలను పంపించడంతో అంతర్జాతీయ వాణిజ్య విపణిలో భారత దేశం బలమైన పోటీదారుగా నిలిచిందని ప్రధాని చెప్పారు.

అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరవడం వల్ల చాలా మంది యువ స్టార్టప్‌లు అందులో చేరడానికి దారితీసిందని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రధాని పేర్కొన్నారు. “భారతీయ పరిశ్రమలు , స్టార్టప్‌లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు మరియు కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయి. ముఖ్యంగా, IN-SPAce సహకారం ఈ ప్రాంతంలో పెద్ద మార్పును తీసుకురానుంది.”

ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థుల శక్తిని కూడా కొనియాడారు. దీనిని కేవలం విద్యార్థి యూనియన్ రాజకీయాల కోణంలో ఆలోచించవద్దని చెప్పారు. భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి విద్యార్థి శక్తియే ప్రాతిపదిక అని తెలిపారు.

“యువత హ్యాకథాన్‌లలో సమస్యలను పరిష్కరించడం,  రాత్రంతా మేల్కొని గంటల తరబడి పని చేయడం చాలా స్ఫూర్తిదాయకం. దేశంలోని లక్షలాది మంది యువత ఏకతాటిపైకి రావడంతో ఇటీవలి సంవత్సరాలలో నిర్వహించిన హ్యాకథాన్ అనేక సవాళ్లను పరిష్కరించింది, కొత్త పరిష్కారాలను అందించింది” అని గుర్తు చేశారు.

ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, సెమీకండక్టర్లు మరియు 5జి కమ్యూనికేషన్‌ల ఇతివృత్తాలను స్పృశించినట్లు ఆయన వాటిలో కొన్ని వివరాలను ఉదహరించారు. అనేక ఐఐటీలు కూడా స్థానిక భాషలను నేర్చుకోవడాన్ని సులభతరం చేసే బహుళ భాషా ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేస్తున్నాయని, జాతీయ విద్యా విధానం లక్ష్యాలను సాధించడంలో ఇది సహాయపడుతుందని ఆయన తెలిపారు. భారతీయ శాస్త్రవేత్తలు ఈ స్పేస్ టెక్నాలజీని మన దేశంలోనే అభివృద్ధిపరచడం మాత్రమే కాకుండా, ఇస్రో డజన్లకొద్దీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తోందని చెప్పారు.