కంగనా బేషరతుగా చేరితే స్వాగతిస్తాం… నడ్డా!

హిమాచల్ ప్రదేశ్ నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే తాను బీజేపీలో చేరుతానని ప్రముఖ బాలీవుడ్ నటి  కంగన రనౌత్ ప్రకటనను బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా స్వాగతించారు.  అయితే బీజేపీలో ఎవ్వరు చేరినా బేషరతుగా చేరవలసిందే అని స్పష్టం చేశారు. కేవలం పోటీ చేయడం కోసం పార్టీలో చేరాలంటే కుదరదని సంకేతం ఆయన ఇచ్చారు. 
 
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడంపై సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని నడ్డా చెప్పారు. శనివారం ఓ మీడియా సంస్థ హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి నడ్డాతో పాటు కంగనా హాజరయ్యారు. 
 
ఈ సందర్బంగా కంగనా మాట్లాడుతూ.. రాజకీయాల్లో చేరేందుకు తాను సుముఖమేనని చెప్పారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్‌ లోని మండీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని తెలిపింది.
ఆ తర్వాత జేపీ నడ్డా ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. కంగన రనౌత్ చెప్పిన మాటలను ఆయన వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన స్పందిస్తూ, ‘‘కంగన రనౌత్ మా పార్టీలో చేరాలనుకుంటే ఆమెకు స్వాగతం. పార్టీతో కలిసి పని చేయాలనుకునేవారు ఎవరికైనా మంచి అవకాశం ఉంటుంది” అని చెప్పారు.
“అయితే ఎన్నికల్లో పోటీ చేయడం విషయానికి వస్తే, అది నా ఒక్కడి నిర్ణయం కాదు. దాని కోసం క్షేత్ర స్థాయి నుంచి, ఎన్నికల కమిటీ, ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు వరకు సంప్రదింపుల ప్రక్రియ ఉంది’’ అని తెలిపారు.  బీజేపీలో చేరాలనుకునే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తామని పేర్కొంటూ వారు ఏ హోదాలో ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. షరతులపై తాము ఎవరినీ తీసుకోబోమని చెప్పారు. ‘‘మీరు బేషరతుగా రండి, అప్పుడు పార్టీ మాత్రమే నిర్ణయిస్తుందని అందరికీ చెబుతాం’’ అని తెలిపారు. 
ఇలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని నడ్డా భరోసా వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో తాము ట్రెండ్‌సెటర్స్‌మని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మళ్ళీ బీజేపీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 68 శాసన సభ స్థానాలు గల ఈ రాష్ట్రంలో ఎన్నికలు నవంబరు 12న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తుంది.