2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పట్ల కంగనా ఆసక్తి

2024 సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పట్ల బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆసక్తి వ్యక్త పరిచారు. ప్రజలు కోరితే  రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 
 
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు తాను ఏదో ఒక హోదాలో సేవచేయదల్చుకున్నానని. ఇందుకోసం అవసరం అయితే రాజకీయాలలోకి కూడా రావచ్చునని ఆమె స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం కోరుకుంటే ఏ స్థాయిలో అయినా తన ప్రాతినిధ్యం ఉంటుందని శనివారం ఆమె షిమ్లాలో ఓ కార్యక్రమం నేపథ్యంలో తెలిపారు. 
 
కంగనా హిమచల్‌ప్రదేశ్‌లోని మనాలీకి చెందిన వారు. తన సొంత రాష్ట్ర ప్రజల బాగుకు ఏదో ఒక రూపంలో పాటుపడే అవకాశం వస్తే దీనిని తాను కాదనబోనని స్పష్టం చేశారు. పరిస్థితి ఏ విధంగా ఉన్నా ప్రభుత్వం కోరితే తాను ముందుకు వస్తానని, వారి పిలుపు తన అదృష్టంగా భావిస్తానని పేర్కొంటూ బిజెపి పట్ల కంగనా తన ఆసక్తిని వెల్లడించారు. 
 
నవంబర్ 12వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో జరిగిన పంచాయత్ ఆజ్‌తక్ హిమాచల్‌ప్రదేశ్ కార్యక్రమంలో కంగనా పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో మండి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, ఈలోగా అవసరం అయితే రాజకీయాలతో ప్రజాసేవకు దిగుతానని ఆమె స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
త్వరలో జరగనున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇస్తున్న తప్పుడు హామీలను హిమాచల్‌ ప్రజలు విశ్వసించరని తెలిపారు.  అక్కడి ప్రజలకు సొంతంగా సోలార్‌ విద్యుత్‌ ఉందని, వారు తమ కూరగాయాలను తామే పండించుకుంటారని ఆమె చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా కంగన మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ ”ఉచితాలు” పనిచేయవని స్పష్టం చేశారు. ట్విట్టర్‌ను మస్క్ తీసుకోవడంపై స్పందిస్తూ కంగనా తన ట్విట్టర్ ఖాతాపై నిషేధం తొలిగిపోతుందని భావిస్తున్నానని, ఇదే జరిగి తాను ట్విట్టర్‌లో స్పందిస్తూ ఉంటే జనం బతుకులు మెరుగుపడుతాయని చెప్పారు. 
 
అయితే, అంతా సంచలనాత్మకం అవుతుందని, పలు కేసులలో చిక్కుకుని తాను ఇక్కట్లకు గురి అవుతానని కూడా తెలిపారు. ఇప్పుడు ట్విట్టర్ ఖాతా లేకపోవడం హాయిగా ఉందని చెప్పిన కంగనా తిరిగి ఎంటరైతే అందరికి కావల్సినంత మసాలా దక్కుతుందని వ్యాఖ్యానించారు.
ఇక కంగనా రనౌత్‌ ప్రస్తుతం ఎమర్జెన్సీ మూవీలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, సతీష్‌ కౌశిక్‌, శ్రేయాస్‌ తల్పాడె, మిలింద్‌ సొమన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.